తిరుమలలో ఎల్ఈడీ స్ర్కీన్లలో సినిమా పాటలు
ABN , First Publish Date - 2022-04-23T02:42:37+05:30 IST
తిరుమల కొండమీద టీటీడీ ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్ర్కీన్ల మీద హఠాత్తుగా సినిమా పాటలు ప్రత్యక్షం కావడంతో భక్తులు విస్తుపోయారు.
తిరుమల: తిరుమల కొండమీద టీటీడీ ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్ర్కీన్ల మీద హఠాత్తుగా సినిమా పాటలు ప్రత్యక్షం కావడంతో భక్తులు విస్తుపోయారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల తర్వాత దాదాపు అరగంటకు పైగా ఈ ప్రసారాలు సాగాయి. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తుల్లో మరింత ఆధ్యాత్మిక చింతన పెంచడం కోసం తిరుమలలోని రద్దీ ప్రాంతాల్లో ఎల్ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు.టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీబీసీ ఛానల్ కార్యక్రమాలను వీటిలో ప్రసారం చేస్తుంటారు. అయితే శుక్రవారం సాయంత్రం భక్తికార్యక్రమాలను వీక్షిస్తున్న భక్తులు ఒక్కసారిగా షాకయ్యారు. ఉన్నట్టుండి స్ర్కీన్ల్లో హిందీ సినిమా పాటలు రావడం మొదలయ్యాయి. సాయంత్రం 5.40 నుంచి 6.15 గంటల వరకు షాపింగ్ కాంప్లెక్స్ వద్దనున్న ఓ స్ర్కీన్లో వీటిని చూసిన భక్తులు గగ్గోలు చేశారు. దీంతో వెంటనే ఎల్ఈడీ స్ర్కీన్లను ఆపే ప్రయత్నం చేశారు. షాపింగ్ కాంప్లెక్స్ ముందున్న స్ర్కీన్పై మాత్రం అరగంట పాటు సినిమా పాటలు, యాడ్లు వచ్చాయి. ఓవైపు మైకుల్లో గోవిందనామాలు వినిపిస్తుండగా, ఇంకోవైపున స్ర్కీన్పై సినిమా పాటలు రావడంపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.