కొవిడ్‌కు కొత్త ఔషధం మోల్నుపిరావిర్‌!

ABN , First Publish Date - 2021-05-22T09:43:40+05:30 IST

కొవిడ్‌ మహమ్మారిని అడ్డుకునేందుకు మరో ఔషధం సిద్ధం కానుంది. వైరస్‌ ప్రభావం తక్కువగా ఉన్నవారిలో కొవిడ్‌ను నియంత్రించగల సామర్థ్యం ఉందని భావిస్తున్న మోల్నుపిరావిర్‌ ట్యాబెట్ల క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో జరుగుతున్నాయి.

కొవిడ్‌కు కొత్త ఔషధం మోల్నుపిరావిర్‌!

యశోద ఆస్పత్రిలో 3వ దశ క్లినికల్‌ ట్రయల్స్‌

హైదరాబాద్‌ సిటీ/ హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ మహమ్మారిని అడ్డుకునేందుకు మరో ఔషధం సిద్ధం కానుంది. వైరస్‌ ప్రభావం తక్కువగా ఉన్నవారిలో కొవిడ్‌ను నియంత్రించగల సామర్థ్యం ఉందని భావిస్తున్న మోల్నుపిరావిర్‌ ట్యాబెట్ల క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో జరుగుతున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో రెండు క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతం కావడం విశేషం. యశోదలో జరుగుతున్న మూడో క్లినికల్‌ ట్రయల్స్‌ను శుక్రవారం నుంచి మొదలుపెట్టినట్లు యశోద ఆస్పత్రుల డైరెక్టర్‌ డాక్టర్‌ లింగయ్య తెలిపారు. 18 నుంచి 60 ఏళ్ల వయస్సున్న వారిపై ఈ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ‘‘భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి పొందిన నాట్కో ఫార్మాతో కలిసి దేశంలో తొలిసారిగా మూడో క్లినికల్‌ ట్రయల్స్‌ను వంద మందిపై ప్రారంభించాం. దీని తర్వాత నాలుగవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌నూ నిర్వహిస్తాం. మోల్నుపిరావిర్‌తో కొవిడ్‌ను ప్రారంభ దశలోనే కట్టడి చేయవచ్చు. ట్రయల్స్‌లో ఎంపిక చేసిన కరోనా రోగులకు రోజుకు రెండుసార్లు 400 ఎంజీ చొప్పున మోల్నుపిరావిర్‌ ఇస్తాం. రోగులందరూ నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు’’ అని లింగయ్య పేర్కొన్నారు.

Updated Date - 2021-05-22T09:43:40+05:30 IST