ఐదు మీటర్ల దూరంలోనే పట్టేస్తుంది!
ABN , First Publish Date - 2020-03-29T09:29:27+05:30 IST
విదేశాల నుంచి వచ్చిన వారితోనే కరోనా పాజిటివ్ వస్తుండడం, ఆయా దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉండడంతో పోలీసులు...
- హోం క్వారంటైన్ యాప్లో సరికొత్త ఫీచర్
విజయవాడ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): విదేశాల నుంచి వచ్చిన వారితోనే కరోనా పాజిటివ్ వస్తుండడం, ఆయా దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా ఉండడంతో పోలీసులు నిఘా పెంచారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి మొత్తం 29వేల మంది ఏపీకి వచ్చారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటివారిపై పూర్తిస్థాయి నిఘా పెట్టడానికి పోలీసులు ప్రత్యేకంగా జియో ఫెన్సింగ్తో పనిచేసే హౌస్ క్వారంటైన్ యాప్ను రూపొందించారు. దీన్ని విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు డౌన్లోడ్ చేసుకోవాలి. లేకపోతే పోలీసులే కచ్చితంగా డౌన్లోడ్ చేయిస్తారు.
ఇందులో వివరాలన్నీ నమోదు చేసినప్పటి నుంచి వారిపై నిఘా ఉంటుంది. వారు ఇంటి నుంచి బయటకు వస్తే డీజీపీ కార్యాలయానికి, సంబంధిత జిల్లా ఎస్పీకి అలెర్ట్ వెళ్తుంది. దీంతోపాటు సాధారణ ప్రజానీకానికి కూడా తెలిసేలా కొత్త ఫీచర్ను యాప్లో పొందుపరుస్తున్నారు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వ్యక్తికి 5మీటర్ల దూరంలో ఎవరైనా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి ఉంటే ఫోన్కు అలెర్ట్ వెళుతుంది. ఇది రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి వస్తుందని పోలీసు వర్గాలు తెలిపాయి.