‘ఎంఎంటీఎస్‌’పై కసరత్తు..!

ABN , First Publish Date - 2020-09-29T12:18:10+05:30 IST

అన్ని అనుకూలిస్తే మరో 15 నుంచి 20 రోజుల్లో మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఎంఎంటీఎస్‌) రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

‘ఎంఎంటీఎస్‌’పై కసరత్తు..!

రైళ్ల ప్రారంభంపై ఉన్నతాధికారుల సమాలోచనలు

ఆరున్నర నెలలుగా షెడ్లకే పరిమితమైన లోకల్‌ రైళ్లు

బోగీల్లో భౌతిక దూరం, శానిటైజర్ల వాడకంపై 


హైదరాబాద్‌: అన్ని అనుకూలిస్తే మరో 15 నుంచి 20 రోజుల్లో మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఎంఎంటీఎస్‌) రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ వరుస సడలింపుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రోజులుగా అన్ని రకాల రవాణాలను ప్రారంభిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అంతర్‌ జిల్లాలతోపాటు సిటీ బస్సులను నడిపిస్తున్నాయి. అలాగే  సెప్టెంబర్‌ 7 నుంచి నగరంలో మెట్రో రైళ్లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో దేశంలోని వివిధ నగరాల్లో అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉండే ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆరున్నర నెలల నుంచి షెడ్లకే పరిమితమైన రైళ్లకు మరమ్మతు, పరిశుభ్రత పనులు చేయిస్తున్నట్లు సమాచారం. కాగా, రైళ్లను ప్రారంభించిన తర్వాత ప్రయాణికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో స్టేషన్లలో కొవిడ్‌ జాగ్రత్తలు కూడా తీసుకోనున్నారు.


ప్రధానంగా బోగీల్లో భౌతిక దూరంతో నిలబడాలని, సీట్లలో పరిమితంగా కూర్చోవాలని, రైళ్ల తలుపులను తాకవద్దనే వాటిపై ప్రయాణికులకు వాల్‌పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ జంట నగరాల రవాణాలో అతి కీలకమైన ఎంఎంటీఎస్‌ రైళ్లకు మరికొన్ని రోజుల్లో మోక్షం లభించనున్నట్లు తెలుస్తోంది. అతి తక్కువ ధర, తక్కువ సమయంలో జంట నగరాల్లోని వివిధ ప్రాంతాలకు నిత్యం వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించే లోకల్‌ రైళ్లు మళ్లీ పట్టాలెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరోనాతో మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా సాధారణ, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లతోపాటు ఎంఎంటీఎస్‌ సర్వీసు లను ఎక్కడికక్కడ నిలిపివేసిన విషయం తెలిసిందే.  

Updated Date - 2020-09-29T12:18:10+05:30 IST