జడ్జీలను పండుల కించపరిచారు

ABN , First Publish Date - 2020-08-08T08:29:09+05:30 IST

న్యాయస్థానాలు, న్యాయమూర్తులను కించపరిచేలా వైసీపీ నేత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి తగిన చర్యలు

జడ్జీలను పండుల కించపరిచారు

  • జగన్‌ వెంట్రుకనూ కదపలేరట!
  • ఎమ్మెల్సీ వ్యాఖ్యలు దిగ్ర్భాంతికరం
  • వాటిని సుమోటోగా స్వీకరించండి
  • హైకోర్టు సీజేకు న్యాయవాది లేఖ
  • ఈ ధోరణిపై చర్యలను తీసుకోండి


అమరావతి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): న్యాయస్థానాలు, న్యాయమూర్తులను కించపరిచేలా వైసీపీ నేత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి తగిన చర్యలు చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ అభ్యర్థించారు. ‘జగన్‌ వెంట్రుక కూడా జడ్జీలు కదపలేరు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దిగ్ర్భాంతికరమన్నారు. ఈ మేరకు ఆయన సీజేకు శుక్రవారం లేఖరాశారు. ‘‘ఈ నెల 5న మీడియా సమావేశంలో న్యాయమూర్తుల పట్ల రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రోతపుట్టించేలా ఉన్నాయి. ఇది న్యాయవ్యవస్థ మీద దాడి చేయడమే అవుతుంది. న్యాయప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్న ఈ వ్యాఖ్యలు మీడియాలోనూ వచ్చాయి’’ అని పేర్కొన్నారు. గవర్నర్‌ కోటా కింద ఇటీవలే ఎమ్మెల్సీగా నియమితులైన రవీంద్రబాబు.. న్యాయమూర్తుల పట్ల వాడిన పదజాలం సరికాదని, ఉద్దేశపూర్వకంగా న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, అప్రతిష్ఠపాలు చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. అవి ముందస్తు ప్రణాళికతో చేసినట్లుగానే ఉన్నాయని, సామాన్యులకు సైతం న్యాయవ్యవస్థపట్ల విశ్వాసాన్ని సడలించేలా ఆయన తీరు ఉన్నదని వ్యాఖ్యానించారు. ఈ తరహా ధోరణిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, సుమోటోగా కేసును స్వీకరించాలని ఆ లేఖలో వీవీ లక్ష్మీనారాయణ అభ్యర్థించారు.

Updated Date - 2020-08-08T08:29:09+05:30 IST