ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం
ABN , First Publish Date - 2022-02-21T20:04:27+05:30 IST
ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో మండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరుల సమక్షంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చేత ప్రమాణం చేయించారు. వీరితోపాటు భాను ప్రసాద్, దండే విఠల్, కోటిరెడ్డి లు కూడా ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాలకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ఆయా జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
కాగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పదవీ ప్రమాణం తర్వాత ఆయనకు మండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అసెంబ్లీ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు అభినందనలు తెలిపారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికవడంతోపాటు, తనకు లభించిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని, పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.