అసెంబ్లీకి కాదు.. స్కూలుకు వెళ్లినట్లుంది

ABN , First Publish Date - 2020-10-14T06:48:43+05:30 IST

ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీకి వెళుతున్నట్లు లేదని, స్కూలు కు పోయి హెడ్మాస్టర్‌ చెప్పే పాఠాలు విని వస్తున్నట్లు ..

అసెంబ్లీకి కాదు.. స్కూలుకు వెళ్లినట్లుంది

హెడ్మాస్టర్‌ పాఠాలు విని వస్తున్నట్లుంది

వర్షాలకు పంట నష్టం జరిగితే.. చర్చే లేదు

ముంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు..చదువుకున్న వేలుముద్రగాళ్లయ్యారు: జగ్గారెడ్డి  


హైదరాబాద్‌, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీకి వెళుతున్నట్లు లేదని, స్కూలు కు పోయి హెడ్మాస్టర్‌ చెప్పే పాఠాలు విని వస్తున్నట్లు ఉన్నదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. భారీ వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు, హైదరాబాద్‌ నగరం మునిగిపోయి ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ఆ అంశాలపై అసెంబ్లీలో చర్చే లేదని ప్రభుత్వ తీరును విమర్శించారు. శాసనసభ నిరవధిక వాయిదా అనంతరం మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. ‘‘అసెంబ్లీ ఎప్పుడు పెడతరో.. ఎప్పుడు బంజేస్తరో తెలియట్లేదు. బీఏసీలు లేవు.. అజెండాలూ లేవు. రాష్ట్రంలో చిత్రమైన పాలన నడుస్తోంది’’ అని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమనియోజకవర్గాల్లో రైతుల ఇబ్బందుల గురించీ సభలో ప్రస్తావించలేదన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. చదువు వచ్చిన వేలుముద్రగాళ్లుగా మా రారని విమర్శించారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా బిల్లులను ఆమోదించుకునేందుకే శాసనసభ సమావేశాన్ని పెట్టారని, ఆ బిల్లులపైనా చర్చించలేదని విమర్శించారు.


ఇంత హడావుడిగా జీహెచ్‌ఎంసీ చట్టానికి సవరణలు తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి రూ.72 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం కేసీఆర్‌ అంటున్నారని, నగరాభివృద్ధి దాన్ని నమ్మేట్లుగా ఉందా? అని నిలదీశారు. హైదరాబాద్‌లో వేల కోట్లు ఖర్చు చేశారన్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే.. తన నియోజవర్గంలో జరిగి న అభివృద్ధి చూపాలన్నారు. హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లన్నీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌ కుమార్‌రెడ్డి హయాంలో కట్టినవేనన్నా రు. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించి.. తెలంగాణ ఉద్యమం వల్ల నిలిచిపోయిన పనులను ఇప్పుడు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారన్నారు. గడ్డిపోచ తప్పు చేస్తే.. గడ్డిమోపునే తగలబెట్టిన చందంగా ధరణి వ్యవహారం ఉందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల ఆస్తులను తీసుకొచ్చి ప్రయివేటు యాప్‌లో పెట్టి ఏం చేస్తారని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చిన్న సమస్యలకు కూడా సీఎం దగ్గరికి వెళ్లి నిలదేసేవాళ్లు. ఈ అసెంబ్లీతో ప్రజలకు మేలు జరగదు. దుబ్బాక ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడించి సీఎం కేసీఆర్‌కు దెబ్బ కొడితేనే ఆయన ప్రజల వద్దకు వస్తడు. రూ. 5 వేలకు ఓటేశారో ఆ డబ్బులతోనే బతకాల్సి వస్తది.


దుబ్బాకలో కాంగ్రె్‌సను గెలిపిస్తే ఎల్‌ఆర్‌ఎస్‌, ధరణి పంచాయతీ కూడా ఒడుస్తది’’ అన్నారు. కాంగ్రె్‌సను విమర్శిస్తున్న మంత్రి హరీశ్‌రావు.. ఆయనకు చెంచాగిరీ చేస్తున్న పోలీసులు, అధికారులు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొనాలన్నారు. ఎన్నికల ముందు లాంగ్‌స్టాండింగ్‌ కలెక్టర్లను మారుస్తుంటారని, అలాంటిది లాంగ్‌ స్టాండింగ్‌ సిద్దిపేట కలెక్టర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్‌ఎ్‌సలు కలిసి డ్రామా ఆడుతున్నాయన్న విషయం దీన్ని బట్టి స్పష్టమవుతోందని ఆయన అన్నారు.

Updated Date - 2020-10-14T06:48:43+05:30 IST