ఆర్ధిక సాయం కోసం ఆలయకమిటీలు దరఖాస్తుచేసుకోండి:Talasani

ABN , First Publish Date - 2022-07-04T21:38:15+05:30 IST

జంటనగరాల్లో బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) తెలిపారు.

ఆర్ధిక సాయం కోసం ఆలయకమిటీలు దరఖాస్తుచేసుకోండి:Talasani

హైదరాబాద్: జంటనగరాల్లో బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(srinivas yadav) తెలిపారు. నగరంలోని ఆలయ కమిటీలు ప్రభుత్వం  అందించే ఆర్ధిక సహాయం కోసం వెంటనే దరఖాస్తులు అందజేయాలని ఆయన కోరారు. సోమవారం తన కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ లతో కలిసి దేవాదాయ, సాంస్కృతిక, పర్యాటక తదితర శాఖల అధికారులతో ఈ నెల 17 న జరిగే సికింద్రాబాద్, 24 వ తేదీన జరిగే హైదరాబాద్ బోనాల ఉత్సవాల(bonalu) నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. 


ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ బోనాలకు ముందే దేవాలయాలకు ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని అందించాలని నిర్ణయించిందని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ సంవత్సరం కూడా బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఈ నిధులను ప్రభుత్వ పరిధిలోని దేవాలయాలకే కాకుండా ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. డిల్లీ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించే బోనాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు. 


పలు ప్రధాన దేవాలయాలకు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 25 వ తేదీన జరిగే ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు సందర్భంగా 500 మంది కళాకారులతో చార్మినార్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. నగరంలోని పలు ప్రధాన ఆలయాల వద్ద సాంస్కృతిక శాఖ కళాకారుల ఆధ్వర్యంలో వివిధ వేషదారణలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పాతబస్తీ లోని దమయంతి బిల్డింగ్, డిల్లీ దర్వాజ, గోల్కొండ, రవీంద్రభారతి, ఇందిరాపార్క్ వద్ద గల కట్టమైసమ్మ ఆలయం, సికింద్రాబాద్ మహంకాళి ఆలయం, చిలకలగూడ తదితర 8 ప్రాంతాలలో త్రీ డీ మ్యాప్ ల ఏర్పాటు కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 



అదేవిధంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయం,అక్కన్న మాదన్నఆలయం, సబ్జిమండి ఆలయాలకు ప్రభుత్వ ఖర్చులతోనే అంబారీ ఊరేగింపు చేపటడతామని చెప్పారు. బోనాల ఉత్సవాల విశిష్ట తను చాటి చెప్పేలా వివిధ ప్రసార మాధ్యమాలు, కరపత్రాలు, పోస్టర్ ల ద్వారా విస్తృత ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ అమయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T21:38:15+05:30 IST