గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్ గా వాల్యానాయక్ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2022-04-08T23:24:40+05:30 IST

రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(జీ.సి.సి) చైర్మన్ గా నియామకమైన రమావత్ వాల్యా నాయక్ శుక్రవారం సంక్షేమ భవన్ లో బాధ్యతలను స్వీకరించారు.

గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్ గా వాల్యానాయక్ బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సహకార సంస్థ(జీ.సి.సి) చైర్మన్ గా నియామకమైన రమావత్ వాల్యా నాయక్ శుక్రవారం  సంక్షేమ భవన్ లో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలు, మధ్య తరగతి ప్రజలు వృద్ధిలోకి రావడానికి కంటున్న కలలను నిజం చేయడంలో అందరూ వారధులుగా పని చేయాలని అన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో గిరిజనుల సమగ్ర వికాసానికి తెలంగాణ ప్రభుత్వమే పాటుపడిందన్నారు.అసెంబ్లీ సాక్షిగా గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని తీర్మానం చేస్తూ కేంద్రానికి బిల్లు పంపిస్తే కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తమకు గిరిజన రిజర్వేషన్ల బిల్లుపై ప్రతిపాదన రాలేదని ఒక తప్పుడు మాటను పార్లమెంట్ సాక్షిగా చెబుతూ గిరిజనులను ఆందోళనకు గురి చేసిందన్నారు,


అవమానించే విధంగా వ్యవహరించింది. గిరిజనుల పట్ల కేంద్రానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని అన్నారు. గిరిజన రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకుండా గిరిజన ఉద్యోగులకు స్థానికంగా అవకాశం కల్పించే జీవో 3 కొట్టివేసి, గిరిజనుల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది ఎవరో గమనించాలన్నారు. జి.సి.సి బృందం కరోనా కష్టకాలంలో ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా శానిటైజర్, మాస్కులు, సబ్బులు, షాంపులు, ఇతర ఉత్పత్తులు తయారుచేయడంలో అద్భుతంగా పని చేసిందన్నారు. జి సి సి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వాల్యా నాయక్ కార్పొరేషన్ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హోమ్ శాఖ మంత్రి మహమ్మద్ అలీ, ఎక్సైజ్ , టూరిజం శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, జి.సి.సి మాజీ చైర్మన్ గాంధీ నాయక్ తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2022-04-08T23:24:40+05:30 IST