తెలంగాణ ప్రాంతం వెదురు సాగుకు అనుకూలం: నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-02-27T00:16:44+05:30 IST

తెలంగాణ ప్రాంతంలోని నేలలు వెదురు సాగుకు అనుకూలంగా ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు

తెలంగాణ ప్రాంతం వెదురు సాగుకు అనుకూలం: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలోని నేలలు వెదురు సాగుకు అనుకూలంగా ఉన్నాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో వెదురు సాగు బాగా పెరగాలన్నారు. వెదురు సాగు వల్ల ఎకరానికి ఏటా లక్ష రూపాయల ఆదాయం వస్తుందన్నారు. శనివారం మంత్రుల నివాస సముదాయం నుంచి జరిగిన వెదురు సాగు అవకాశాలు - లాభాలపై జరిగిన జూమ్ సమావేశంలో  మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. వెదురు సాగుకు ఆయిల్ పామ్ సాగు మాదిరిగానే ఎలాంటి చీడపీడలు, కోతులు, అడవి పందుల బెడద ఉండదని, గతంలో వెదురు అటవీ శాఖ పర్యవేక్షణలో పెరిగేదని వివరించారు. ప్రస్తుతం విద్యుత్ రంగంలో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వెదురును విరివిగా వినియోగిస్తున్నారు. 


ప్రతి ధర్మల్ విద్యుత్ కేంద్రంలో 5 శాతం వరకు వెదురును వినియోగించాలని కేంద్రం ఆదేశించిందన్నారు. వెదురును ఉద్యాన పంటగా అధిక సాంద్రత పద్దతిలో ఎకరానికి వెయ్యి మొక్కల చొప్పున సూక్ష్మ సేద్యం ద్వారా సాగుచేయాలని సూచించారు.నాటిన రెండేళ్ళ నుండి ఏటా 40 టన్నుల దిగుబడి వస్తుంది.ప్రతి రెండేళ్లకు కోతకు వస్తుందన్నారు. 2 లక్షల ఎకరాలలో వెదురు సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వ యోచస్తోందన్నారు. ఈ సమావేశంల ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, అటవీ ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ వెదురు శాస్త్రవేత్త నంబీ భారతి, రాహుల్ బియాని, అమన్ క్వాతా, అటవీ, ఉద్యాన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-27T00:16:44+05:30 IST