కిటెక్స్ గ్రూప్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం

ABN , First Publish Date - 2021-09-18T21:17:37+05:30 IST

తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, రంగారెడ్డి లోని సీతారాంపురంలో ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పరాల్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ లను కిటెక్స్ గ్రూప్ సంస్థ ఏర్పాటు చేయనుంది.

కిటెక్స్ గ్రూప్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం

హైదరాబాద్: తెలంగాణలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, రంగారెడ్డి లోని సీతారాంపురంలో  ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పరాల్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ లను కిటెక్స్ గ్రూప్ సంస్థ  ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కె.తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పి. సబితా ఇంద్రారెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే కాలే యాదయ్య మరియు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.కిటెక్స్ గ్రూప్ చైర్మన్ సాబు జాకబ్, కంపనీ సీనియర్ ప్రతినిధి బృందం సాబు జాకబ్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కిటెక్స్ సంస్ధ చైర్మన్ సాబు జాకబ్ మాట్లాడుతూ చిన్నపిల్లల వస్త్రాల తయారీలో తమది ప్రత్యేకమైన కంపెనీ అని చెప్పారు.ఈ కంపెనీ నుంచి తయారైన వస్త్రాలు ధరించని పసి పిల్లలు అమెరికాలో ఉండరని చెప్పేందుకు గర్వకారణంగా ఉందన్నారు.  కేరళ నుంచి తమ పెట్టుబడులు ఉపసంహరించుకున్నతర్వాత తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు రావడానికి ప్రధాన కారణం మంత్రి కేటీఆర్. కేటీఆర్ ని కలిసినప్పుడు తనకు పెట్టుబడి కన్నా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కావాలని అడిగారు. ఇక్కడి పరిస్థితులు తెలుసుకున్న తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత తాము వెయ్యి కోట్ల రూపాయల ప్రాథమిక పెట్టుబడిని 2400 కోట్లకు పెంచాము. దీంతో 22000 ఉద్యోగాలు వస్తాయని ఆయన వెల్లడించారు.


భవిష్యత్తులో ఇక్కడి నుంచి 3 మిలియన్ల వస్త్రాలను అమెరికాకి ఎగుమతి చేస్తాము. భవిష్యత్తులో తెలంగాణ వస్త్రాలు ధరించని అమెరికా పిల్లలు ఉండబోరు అన్నది మా నమ్మకం అని తెలిపారు.  అన్ని కార్మిక సంక్షేమ వసతులు తమ క్లస్టర్లలో ఉంటాయి. లక్షన్నర కిట్లను తెలంగాణ ప్రభుత్వానికి తమ కంపెనీ తరఫున అందిస్తామని వెల్లడించారు.


ఈ సందర్్భంగా మంత్రి  కేటీఆర్ మాట్లాడుతూ  కిటెక్స్ సంస్ధ తెలంగాణ కు వచ్చి ఇక్కడి పరిస్థితులను వ్యాపార అనుకూలతను, అవకాశాలు, ప్రభుత్వ విధానాలను దృష్టిలో ఉంచుకుని తమ పెట్టుబడిని నిర్ణయాన్ని ప్రకటించారు. ఒక్క ఫోన్ కాల్తో ప్రారంభమైన ఈ పెట్టుబడి చర్చలు, ఈరోజు ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడి, 22000 ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన, మరో 20,000 పైగా పరోక్ష ఉద్యోగాల కల్పనగా రూపాంతరం చెందిందని తెలిపారు. కేరళలో ప్రైవేట్ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీ, ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కిడ్స్ అప్పరల్ మాన్యుఫాక్చరింగ్  కంపెనీగా ఉన్న కిటెక్స్ గ్రూప్ ను తెలంగాణకి ఆహ్వానిస్తున్నామని అన్నారు.. వరంగల్, రంగారెడ్డి లలో  కంపెనీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను, తమ ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. 


ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ వరంగల్ జిల్లా గీసుకొండ‌-సంగెం, రంగారెడ్డి సీతారాంపూర్ ల‌లో దుస్తులు తయారీ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయడానికి కిటెక్స్ కంపెనీ ముందుకు రావ‌డం సంతోషంగా వుందన్నారు. సీఎం కెసిఆర్ ప‌రిపాల‌న‌తో దేశంలో తెలంగాణ‌కు మంచి పేరు వ‌చ్చింది. కిటెక్స్ కంపెనీకి కూడా మంచి పేరుంది. తెలంగాణ‌లో కిటెక్స్ కంపెనీ పెట్టే పెట్టుబ‌డుల‌తో, ఇక్కడ ఉత్పత్తి అయ్యే బ‌ట్టల‌కు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 22వేల మందికి ప్రత్యక్షంగా, ఇంకా అనేక మందికి ప‌రోక్షంగా ఉపాధి క‌ల్పించాల‌ని సీఎం కేసిఆర్, మంత్రి కేటిఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే టీఎస్ ఐపాస్ ద్వరా ఉమ్మడి భూ కేటాయింపులు జ‌రిగాయని అన్నారు. 

Updated Date - 2021-09-18T21:17:37+05:30 IST