కరోనా సమయంలోనూ రికార్డుస్ధాయిలో పరిశ్రమల ఏర్పాటు: కేటీఆర్

ABN , First Publish Date - 2021-07-30T00:28:15+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు స్ధాపించే వారికి టీఎస్ ఐపాస్ ద్వారా వెంటనే మంజూరు చేస్తోందని పరిశ్రమలు,ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు

కరోనా సమయంలోనూ రికార్డుస్ధాయిలో పరిశ్రమల ఏర్పాటు: కేటీఆర్

రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు స్ధాపించే వారికి టీఎస్ ఐపాస్ ద్వారా వెంటనే మంజూరు చేస్తోందని పరిశ్రమలు,ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు.గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో 750 మెగావాట్ల సోలార్సెల్స్, 750 మెగావాట్ల సోలార్ మాడ్యూల్స్ సోలార్ ప్రీమియర్ ఎనర్జీస్ పరిశ్రమను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 483 కోట్ల రూపాయల పెట్టుబడితో  నిర్మించిన సోలార్ ప్రీమియం ఎనర్జీస్ అభినందిస్తున్నట్టు తెలిపారు. కరోనా సమయంలో కూడా రికార్డు స్థాయిలో పరిశ్రమను స్థాపించి  పనిచేయడం జరిగిందన్నారు. ఈ పరిశ్రమలో 700 మందికి ఉపాధి కల్పించడం జరిగిందని అన్నారు. 90  శాతం మంది తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారని అన్నారు.


ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వం ముందు ఉన్న అతి పెద్ద సమస్య యువతకు ఉపాధి కల్పించడమేనని మంత్రి అన్నారు. పోటీ ప్రపంచంలో రెన్యూ బుల్ ఎనర్జీ ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి పరిశ్రమలకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలో మన రాష్ట్రం రెండో స్థానంలో, దక్షిణ భారత దేశంలో మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ పరిశ్రమలకు అదనంగా పన్నెండు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో రెండు వేల మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందని, స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. ఆగస్టు 5వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా స్కిల్ డెవలప్మెంట్ సంస్థను స్థాపించడం జరుగుతుందని మంత్రి అన్నారు ఐటిఐ, డిగ్రీ , బీటెక్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశం  కల్పిస్తామని తెలిపారు. 


ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నో సమస్యలను సవాళ్లను ఎదుర్కొని అన్నిరంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఐటీ జయేశ్ రంజన్ , టీ.ఎస్.ఐఐసీ ఎం.డి నర్సింహారెడ్డి , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమయ్ కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్. మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, మాజీ డిజిపి తేజ్ దీప్ కౌర్ , డైరెక్టర్ ఎలక్ట్రానిక్స్ కారంపూడి విజయ్, ప్రీమియర్ ఎనర్జీస్ సురేందర్ పాల్ సింగ్ , మేనేజింగ డైరెక్టర్ చిరంజీవి శాలుజా , సుధీర్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిదులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T00:28:15+05:30 IST