జనరంజకమైన,ప్రగతిశీల బడ్జెట్ ఇది: కొప్పులఈశ్వర్

ABN , First Publish Date - 2022-03-07T23:42:22+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం జనరంజకమైన, ప్రగతిశీల బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఎస్సీ, మైనారిటీశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.

జనరంజకమైన,ప్రగతిశీల బడ్జెట్ ఇది: కొప్పులఈశ్వర్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జనరంజకమైన, ప్రగతిశీల బడ్జెట్ ప్రవేశపెట్టిందని ఎస్సీ, మైనారిటీశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్టు మంత్రి కొప్పుల తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ మార్గ నిర్దేశనంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం,అన్నిరంగాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని  బడ్జెట్ రూపొందించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు,వారికిచ్చిన హామీల మేరకు జనరంజకమైన, ప్రగతిశీల బడ్జెట్ ను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ బడ్జెట్ లో ఎస్సీల సంక్షేమం,సముద్ధరణకు రూ.33 వేల 9 వందల 37కోట్ల 75 లక్షలు అంటే 15.49% నిధులను కేటాయించడం ఆనందదాయకమని చెప్పారు.


ఇందులో ఎస్సీల దళితబంధు పథకం  అమలునకు 17 వేల 7వందల కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. దళితబంధు ద్వారా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మైనారిటీల సంక్షేమానికి 6 వేల 6 వందల 44 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఎస్సీ, మైనారిటీ గురుకులాల ద్వారా ఆ వర్గాలకు చెందిన బాలబాలికలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను ఇంగ్లీష్ మీడియంలో ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. కేసిఆర్ నాయకత్వంలో సంక్షేమ,శ్రేయోరాజ్యం కొనసాగుతున్నదని చెప్పడానికి ఈ బడ్జెట్ ద్వారా ప్రపంచానికి మరోసారి చాటి చెప్పిందన్నారు.

Updated Date - 2022-03-07T23:42:22+05:30 IST