కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి హరీష్

ABN , First Publish Date - 2022-03-14T18:08:58+05:30 IST

కేంద్రంపై మంత్రి హరీష్‌ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి హరీష్

హైదరాబాద్: కేంద్రంపై మంత్రి హరీష్‌ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ... తెలంగాణపై కేంద్రం తీవ్ర వివక్ష చూపిందన్నారు. 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదని మండిపడ్డారు. ఒక్కో కాలేజీకి 200 కోట్లు మంజూరు చేసిన కేంద్రం...తెలంగాణకు మొండి చేయి చూపిందని విమర్శించారు. వైద్యారోగ్య రంగాన్ని ఉమ్మడి పాలకులు నిర్లక్యం చేశారన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 3 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్యను 33కి పెంచుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఉక్రెయిన్ వెళ్లిన మన విద్యార్థుల బాధలు వర్ణనాతీతమన్నారు. గత పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపించారు. వైద్య విద్య కోసం భాష రాకపోయినా ఉక్రెయిన్, చైనా తదితర దేశాలకు వెళ్లి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నందు వల్ల విద్యార్థులు ఇక్కడే వైద్య విద్యను చదువుకోవడం సాధ్యం కానున్నదని చెప్పుకొచ్చారు.


పట్టణాల్లోని పేదల సుస్తీని పోగొడుతూ.. బస్తీ దవాఖానాలు గొప్పగా సేవలు అందిస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో దేశంలో మొదటి సారి ఏర్పాటు చేసిన ఈ బస్తీ దవాఖానపై 15వ ఆర్థిక సంఘం ప్రశంసలు కురిపించిందని పేర్కొన్నారు. 350 ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ప్రస్తుతం 259 సేవలు అందిస్తున్నాయని...త్వరలో మిగతా చోట్ల అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. బస్తీ దవాఖానల నుండి టెలి మెడిసిన్ సేవలు కూడా అందిస్తున్నామన్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వైద్యులు ఈ విధానం ద్వారా అవసరమైన సేవలు అందిస్తున్నారని హరీష్‌రావు తెలిపారు. ఉచితంగా 57 రకాల పరీక్షలు, ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడం వల్ల పట్టణ పేదలకు ఎంతో ఉపయోగం ఉందన్నారు. అన్ని పట్టణాల్లో 60 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. 

Updated Date - 2022-03-14T18:08:58+05:30 IST