ప్రార్థనకు వచ్చిన కరోనా బాధితుడు.. ధైర్యం చెప్పిన హరీశ్
ABN , First Publish Date - 2020-04-05T00:24:31+05:30 IST
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ ఎక్కువ అవుతుండటంతో రాష్ట్ర ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
సిద్దిపేట: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ ఎక్కువ అవుతుండటంతో రాష్ట్ర ప్రజలు భయంతో వణికిపోతున్నారు. తాజాగా.. గజ్వేల్కు చెందిన కరోనా బాధితుడు సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి మండలం మాదన్నపేటకు ప్రార్థనలకు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు మాదన్నపేటకు వెళ్లారు. గ్రామస్తులు ఎవరూ భయపడొద్దని.. ప్రభుత్వం అన్ని విధాలా తగు చర్యలు, జాగ్రత్తలు తీసుకుంటుందని మంత్రి అభయమిచ్చారు.
ఎవరూ భయపడొద్దు
‘ కరోనా వైరస్ అంటే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఈ నెల ఏప్రిల్ 15 వరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లొద్దు. ఎవరి ఇంట్లో వారే ఉన్నట్లయితే మన కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడుకున్న వాళ్లమవుతాము. ప్రభుత్వం కరోనా పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు’ అని మంత్రి చెప్పారు. ప్రార్థనా మందిరం, గ్రామంలో డ్రోన్ల ద్వారా స్ప్రే చేయించాలనే యోచనలో మంత్రి ఉన్నట్లు తెలుస్తోంది.