పరకాలలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్ధాపన చేసిన హరీశ్ రావు

ABN , First Publish Date - 2022-03-05T23:28:37+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తుందో అదే చేయడానికి మిగిలిన రాష్ట్రాలు చూస్తుంటాయని, దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.

పరకాలలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్ధాపన చేసిన హరీశ్ రావు

హన్మకొండ: తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తుందో అదే చేయడానికి మిగిలిన రాష్ట్రాలు చూస్తుంటాయని, దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శనివారం హన్మకొండ జిల్లా పరకాలలో 100 పడకల హాస్పిటల్ కి మంత్రులు ఎర్రబెల్లి దయాకర రావు, సత్యవతి రాథోడ్ తో కలిసి శంకుస్ధాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ పరకాలలో 100 పడకల ఆసుపత్రికి శంఖుస్థాపన చేసుకోవడం సంతోషకరమని చెప్పారు. ఏడాదిలో ఆసుపత్రి పూర్తి చేస్తామని అన్నారు.తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా వుందని, తెలంగాణ ఏం చేస్తుందో అదే చేయడానికి అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయని తెలిపారు.ఎవరూ అడగకున్నా రైతుబందు ఇచ్చాము.దాన్నికూడా కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది. రైతు భీమా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని,నీటి తీరువా లేకుండా రైతన్నలకు నీళ్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్టమని అన్నారు.


 పైరవీలు లేకుండా రైతు బంధు ఇస్తున్నాం.రైతు మొహంలో ఆనందం, పెదాలపై చిరునవ్వు చూస్తున్నాం.పట్టుబట్టి తెలంగాణకు మిషన్ భగీరథ నీళ్లిచ్చిన ఘనుడు కేసీఆర్ అని కొనియాడారు. ఏటా 5 వేల కోట్లిస్తాం, వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ప్రాణం పోయినా మీటర్లు పెట్టమని కేంద్రానికి కేసీఆర్ తెగేసి చెప్పిండు.వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గిరిజన వర్సిటీ దిక్కులేవు. ఉన్నవాటిని అమ్మడానికి బీజేపీ చూస్తోందని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నది.డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నారు.సామాన్య, మధ్యతరగతి ప్రజలను దోచుకోవడమే బీజేపీ లక్ష్యంగా మారిందన్నారు. ఎన్నికల ముందు తక్కువ చెప్పి, ఎక్కువ పని చేస్తున్నాము. రు.500 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు మహిళా సంఘాలకు అందిస్తాం. అభయ హస్తం డబ్బులు తిరిగి మహిళలకు అందిస్తాం.ఎన్నికలు లేకున్నా, మ్యానిఫెస్టోలో లో పెట్టకున్నా, ఎవరు అడగకున్నా రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి వంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నామని మంత్రి హరీశ్ రావు వివరించారు.


ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెల్లెందుకు కందెనలు, బిందెలు, గడ్డి మాటలు తీసుకువెల్లి నిరసన తెలిపేవారు. ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా పోయిందన్నారు. మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు నుంచి వచ్చిన ప్రతినిధులు అక్కడి రైతులు తెలంగాణ పథకాలను మెచ్చుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కి ఇంతకుమించి నిదర్శనం ఏముంటుందని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపి పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ధర్మా రెడ్డి, పెద్ధి సుదర్శన్, ఆరూరి రమేష్, వెంకట రమణా రెడ్డి,  ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్, టీఎస్ ఎంఎస్ఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-05T23:28:37+05:30 IST