ఆ విషయంలో చంద్రబాబుతో కలిసి రఘురామ దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి బాలినేని
ABN , First Publish Date - 2021-12-18T19:12:37+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో రఘురామరాజు జతకలిసి దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశం: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో రఘురామరాజు జతకలిసి దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంత్రి బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద అంత అభిమానం ఉంటే జగన్ బొమ్మ మీద గెలిచిన ఆయన రాజీనామా చేసి టీడీపీ నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీని పొగడడం వంటి డ్రామాలు మానుకోవాలని హితవు పలికారు.
దమ్ము, ధైర్యం ఉంటే సొంత నియోజకవర్గంలో పర్యటించాలన్నారు. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిస్తే ఎవరు విజన్ ఉన్న నాయకుడో తెలుస్తుందని చెప్పారు. అమరావతిని రాజధానిగా పెట్టిన చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం సరైన రోడ్లు కూడా వేయలేకపోయిన చంద్రబాబు ఎలా రాజధాని అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. అమరావతికి గ్రాఫిక్స్ తప్ప ఏమీ చేయలేకపోయారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇప్పటికైనా దయచేసి సీఎం జగన్కు సహకరించాలని కోరారు. వైజాగ్ అభివృద్ధి చెందిన నగరం.. తక్కువ ఖర్చుతో ఎక్కువ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అమరావతి అభివృద్ధికి కావాల్సినంత నిధులు తెచ్చి ఖర్చు పెట్టే పరిస్థితి లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.