ఖానాపూర్ లో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు మంత్రి ఇంద్రకరణ్ శంఖుస్థాపన
ABN , First Publish Date - 2021-03-03T19:51:56+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలకు చేరువలో ఉన్న అటవీ బ్లాకులను అభివృద్ది చేసి అర్బన్ పార్కులుగా, లంగ్ స్పేస్ కేంద్రాలుగా అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని అటవీ,
ఖానాపూర్: రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాలకు చేరువలో ఉన్న అటవీ బ్లాకులను అభివృద్ది చేసి అర్బన్ పార్కులుగా, లంగ్ స్పేస్ కేంద్రాలుగా అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఖానాపూర్ పట్టణానికి సమీపంలో మస్కాపూర్ బీట్ లో హరితవనం (అర్బన్ ఫారెస్ట్ ) పార్క్ ఏర్పాటుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మావల, నిర్మల్, ఆసిఫాబాద్ పట్టణాలకు సమీపంలో ఇప్పటికే ప్రారంభమైన అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో వారాంతాలు, సెలవు రోజుల్లో ప్రజలు ప్రశాంతంగా గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. ఖానాపూర్ లో 225 హెక్టార్లలో రూ.8.50 కోట్ల వ్యయంతో అర్బన్ ఫారెస్ట్ పార్కును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఒత్తిడి నుంచి ఆటవిడుపు కోసం పిల్లలకు ఆటస్థలం, వాకింగ్, సైక్లింగ్, పగోడాలు, కనోఫి వాక్, లోటస్ పాండ్, వాచ్ టవర్ చుట్టూ ఫెన్సింగ్, బంధుమిత్రులతో వనభోజనాలు చేసుకునేలా ఈ అటవీ ఉద్యానవనాన్ని తీర్చిదిద్దనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్, జడ్పీ చైర్ పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్కుమార్, ఎఫ్ డీవో, ఇతర ప్రజాప్రతినిదులు, అధికారులు పాల్గొన్నారు.