ప్రకాశంలో మైనింగ్ భూములు డీరిజర్వ్
ABN , First Publish Date - 2021-05-11T09:30:49+05:30 IST
ఐరన్ ఓర్ తవ్వకాల కోసం ప్రకాశం జిల్లాలో సుదీర్ఘకాలం నుంచి రిజర్వ్ చేసి ఉంచిన భూములను వైసీపీ ప్రభుత్వం డీరిజర్వ్ చేసింది
790 ఎకరాలపై ప్రభుత్వం నిర్ణయం.. నోటిఫికేషన్ జారీ
అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): ఐరన్ ఓర్ తవ్వకాల కోసం ప్రకాశం జిల్లాలో సుదీర్ఘకాలం నుంచి రిజర్వ్ చేసి ఉంచిన భూములను వైసీపీ ప్రభుత్వం డీరిజర్వ్ చేసింది. ఐరన్ ఓర్ కోసం 1972లో రిజర్వ్ చేసిన 3143 ఎకరాల్లో 789.88 ఎకరాల ప్రజాప్రయోజనార్థం డీరిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది. టంగుటూరు మండలంలోని కొనిజేడు, మర్లపాడు గ్రామాల్లోని ఈ భూమిని డీజర్వ్ చేస్తూ గనుల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. రిజర్వ్ చేసిన భూముల్లో 1307 ఎకరాల భూమిని ఏపీఎండీసీకి లీజుకు ఇవ్వగా ఏపీఎండీసీ పలు సంస్థలకు సబ్ లీజు ఇచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో అక్కడ ఐరన్ మైనింగ్ జరగడం లేదని, మైనింగ్ జరిగిన చోట్ల కూడా అది ఉపయోగకరంగా లేదని పేర్కొంది. దీంతో పరిసర ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పడ్డాయని, ఫలితంగా అక్కడ మైనింగ్ చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఈ మేరకు జిల్లా కలెక్టరు ఇచ్చిన నివేదిక ఆధారంగా మొత్తం 1307 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు గతంలోనే ప్రభుత్వం అనుమతి తెలిపింది. కాగా ప్రస్తుతం పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం కోసం నిరుపయోగంగా ఉన్న రిజర్వ్డ్ భూమిలో 789.88 ఎకరాలను మాత్రం డీరిజర్వ్ చేసింది. అవి కొనిజేడు గ్రామంలో 391 ఎకరాలు, మర్లపాడు గ్రామంలో 398.88 ఎకరాలు ఉన్నాయి.