మిడతల దండుకు సరిహద్దుల్లోనే కళ్లెం!

ABN , First Publish Date - 2020-05-29T09:02:55+05:30 IST

మిడతల దండు తెలంగాణలోకి దూసుకు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్ర సరిహద్దులో గల జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేసినట్లు, ఫైర్‌ ఇంజన్లు, జెట్టింగ్‌ మిషన్లు, పెస్టిసైడ్లను సిద్ధంగా పెట్టినట్లు

మిడతల దండుకు సరిహద్దుల్లోనే కళ్లెం!

  • 12 ఫైరింజన్లు, మరో 12 జెట్టింగ్‌ మిషన్లు సిద్ధం
  • అందుబాటులో 15 వేల లీటర్ల పురుగుల మందులు
  • నియంత్రణ చర్యలపై ఐదుగురితో కమిటీ: కేసీఆర్‌


హైదరాబాద్‌, మే 28(ఆంధ్రజ్యోతి): మిడతల దండు తెలంగాణలోకి దూసుకు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్ర సరిహద్దులో గల జిల్లాల కలెక్టర్లను, పోలీసు అధికారులను అప్రమత్తం చేసినట్లు, ఫైర్‌ ఇంజన్లు, జెట్టింగ్‌ మిషన్లు, పెస్టిసైడ్లను సిద్ధంగా పెట్టినట్లు తెలిపారు. మిడతల దండు కదలికలను ఎప్పటికప్పుడు గమని స్తూ, అవి తెలంగాణలోకి ప్రవేశించకుండా చేపట్టే చర్యల పర్యవేక్షణకు ఐదుగురు సభ్యుల కమిటీని నియమించినట్లు చెప్పారు. మిడతలు తెలంగాణ వైపు వస్తే ఎలా వ్యవహరించాలనే దానిపై ప్రగతి భవన్‌లో గురువారం సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రఽధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు బి.జనార్దన్‌రెడ్డి, ఎస్‌. నర్సింగ్‌రావు, జయేశ్‌ రంజన్‌, పీసీసీఎఫ్‌ శోభ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, అగ్నిమాపకశాఖ డీజీ సంజయ్‌ కుమార్‌జైన్‌, వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు తదితర అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.


రాజస్థాన్‌లోకి ప్రవేశించిన మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్రలోని భండార, గోండియా మీదుగా మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ వైపు వెళ్తున్న ట్లు సమాచారం ఉందని అధికారులు చెప్పారు. అక్క డి నుంచి ఉత్తర భారతదేశంవైపు ప్రయాణించి పంజాబ్‌ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గాలివాటం ప్రకారం ప్రయాణించే అలవాటున్న మిడతల దండు, ఒకవేళ గాలి దక్షిణం వైపు మళ్లితే ఛత్తీ్‌సగఢ్‌ మీదుగా తెలంగాణ వైపు వచ్చే అవకాశం కొం తమేరకే ఉన్నట్లు తేల్చారు. అయినా రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించకుండా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని   సీఎం నిర్ణయించారు. ‘‘ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ సరిహద్దులో గల మిడతల దండును సంహరించేందుకు గోండి యా ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కోట్ల సంఖ్యలో మిడతలను చంపగలిగారు. గాలి మరలి తెలంగాణలోకి రాకుండా సరిహద్దుల్లోనే పెద్ద ఎత్తున పురుగుల మందు పిచికారీ చేసి సంహరించాలి’’ అని సీఎం సూచించారు. సమీక్షలో  మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి,  వెంకటవీరయ్య, జీవన్‌రెడ్డి, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 


హెలికాప్టర్‌ ద్వారా పర్యవేక్షణ 

రాష్ట్రంలోకి మిడతలు రాకుండా అడ్డుకునే చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. సీఐపీఎం ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఆర్‌.సునీత, వ్యవసాయ వర్సిటీ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ ఎస్‌.జె. రహమాన్‌, వరంగల్‌ ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ అక్బర్‌, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ, మంచిర్యాల కలెక్టర్‌ భారతి కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ శుక్రవారం నుంచి 4 రోజుల పాటు రామగుండంలోనే మకాం వేస్తుంది. హెలికాప్టర్‌ ద్వారా ఆదిలాబాద్‌ నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట పరిస్థితిని గమనిస్తూ ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులనూ అప్రమత్తం చేశారు.


రాష్ట్ర సరిహద్దుల్లో ఫైరింజన్లు, జెట్టింగ్‌ మిషన్లు

సీఎం సమీక్ష నేపథ్యంలో కీటకాల నియంత్రణ చర్యల కోసం పురుగుల మందులు, ఫైరింజన్లు, జెట్టింగ్‌ మిషన్లను ఎక్కడెక్కడ అందుబాటులో ఉంచాలని చర్చించి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ర్టాల సరిహద్దు ప్రాంతాల్లో 15 వేల లీటర్ల మాలథియాన్‌, క్లోరోఫైరిపాస్‌, లామ్డా సైలోత్రిన్‌ ద్రావణాలను సిద్ధంగా ఉంచుతున్నారు. 12 ఫైరింజన్లు, మరో 12 జెట్టింగ్‌ మిషన్లను సిద్ధం చేశారు. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, పరిస్థితికి అనుగుణంగా పనిచేయాలని ఉన్నతాధికారుల బృందం నిర్ణయించింది.


సరిహద్దు జిల్లాల రైతుల్లో ఆందోళన

మిడతల ప్రయాణంలో గాలి తెలంగాణ వైపు మళ్లితే మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ మీదుగా రాష్ట్రంలోకి వచ్చే అవకాశం ఉండటంతో సరిహద్దుల్లోని  నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, పెద్దపల్లి జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు అప్రమత్తమై వారికి సూచనలిస్తున్నారు. మిడతలు కనిపిస్తే కిసాన్‌ మిత్ర టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004251110కు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. తొలగించిన పత్తి కర్రను తగలబెడితే మిడతలు చనిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. జూన్‌ రెండో వారం నుంచే రైతులు వానాకాలం పంటలు వేస్తారు. వరితో పాటు ఈసారి పత్తి, కంది విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. 1.3 కోట్ల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగుచేసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పకడ్బందీ ప్రణాళిక, సమన్వయం, సామూహిక దాడితోనే మిడతలను నియంత్రించేందుకు ఆస్కారం ఉంటుంది. కాగా, మిడతలను కట్టడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం దోమల నివారణకు వినియోగిస్తున్న యంత్రాలు, డ్రోన్లతోనే రసాయనాలు పిచికారీ చేస్తామని చీఫ్‌ ఎంటమాలజిస్ట్‌ రాంబాబు తెలిపారు.

Updated Date - 2020-05-29T09:02:55+05:30 IST