Singapore లో భారత సంతతి వ్యక్తికి ఉరిశిక్ష.. రద్దు చేయాలంటూ ప్రపంచవ్యాప్తంగా 75వేల మంది విజ్ఞప్తి
ABN , First Publish Date - 2021-11-07T13:03:24+05:30 IST
సింగపూర్లో 42.72 గ్రాముల హెరాయిన్తో పట్టుబడ్డ మలేసియాకు చెందిన భారత సంతతి యువకుడు నాగేంద్రన్.కె.ధర్మలింగం(33)కి మరణ శిక్ష తప్పే మార్గాలన్నీ మూసుకుపోయాయి.
సింగపూర్, నవంబరు 6: సింగపూర్లో 42.72 గ్రాముల హెరాయిన్తో పట్టుబడ్డ మలేసియాకు చెందిన భారత సంతతి యువకుడు నాగేంద్రన్.కె.ధర్మలింగం(33)కి మరణ శిక్ష తప్పే మార్గాలన్నీ మూసుకుపోయాయి. 2009లో.. 22 ఏళ్ల వయసులో నాగేంద్రన్ మలేసియా నుంచి డ్రగ్స్ తరలిస్తూ సింగపూర్ పోలీసులకు పట్టుబడ్డాడు. సింగపూర్ చట్టాల ప్రకారం 15 గ్రాములను మించి డ్రగ్స్ దొరికితే.. నిందితులకు ఉరిశిక్ష విధించవచ్చు. ఆ మేరకు కోర్టు శిక్షను ఖరారు చేసింది. శిక్ష ఖరారైనప్పటి నుంచి అతని మానసిక స్థితి బాగోలేదు. ఆ తర్వాత నాగేంద్రన్ కుటుంబం.. క్షమాభిక్షకు అన్ని ప్రయత్నాలు చేసింది. జైలు అధికారులు గత నెల 26న నాగేంద్రన్ తల్లికి ఓ లేఖ రాశారు. దాని ప్రకారం.. ఈ నెల 10న(బుధవారం) నాగేంద్రన్ ఉరిశిక్షను అమలు చేస్తారు. దీంతో.. చివరి ప్రయత్నంగా నాగేంద్రన్ కుటుంబ సభ్యులు చేంజ్ డాట్ ఓఆర్జీలో పిటిషన్ లేవనెత్తారు. మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకుని నాగేంద్రన్ను విడుదల చేయాలంటూ ప్రపంచవ్యాప్తంగా 75 వేల మంది కోరారు. దీనిపై మలేసియా ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ.. ‘‘నిందితుడికి తాను చేసిన నేరం ఏంటో తెలుసు’’ అని సమాధానమిచ్చారు. దీన్ని బట్టి.. చేంజ్ డాట్ ఓఆర్జీ, మహిళల సంతకాలు నాగేంద్రన్ను కాపాడలేవని స్పష్టమవుతోంది.