సుస్వర నాదం!
ABN , First Publish Date - 2022-01-26T09:18:45+05:30 IST
‘కౌసల్య సుప్రజరామా’ అంటూ భద్రాద్రి ఆలయంలో తన నాదస్వరంతో నిత్యం స్వామివారి సుప్రభాత సేవలో షేక్ హసన్ సాహెబ్ మునిగేవారు.
- భద్రాద్రి తొలి నాదస్వర
- విద్వాంసుడు షేక్ హసన్ సాహెబ్
- 1950లో నియామకం..1996 దాకా సేవలు..
- 93 ఏళ్ల వయసులో కన్నుమూత
భద్రాచలం, జనవరి 25: ‘కౌసల్య సుప్రజరామా’ అంటూ భద్రాద్రి ఆలయంలో తన నాదస్వరంతో నిత్యం స్వామివారి సుప్రభాత సేవలో షేక్ హసన్ సాహెబ్ మునిగేవారు. ఆ దేవస్థానం తొలి నాదస్వర ఆస్థాన విద్వాంసుడు సాహెబే! ఆయనకు మరణాంతరం కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఏపీలోని కృష్ణాజిల్లా తిరువూరు మండలం గోసవీడు వాస్తవ్యులైన హసన్సాహెబ్ 1950లో దేవస్థానం తొలి నాదస్వర విద్వాంసులుగా బాధ్యతలు చేపట్టారు. 1996వరకు పని చేశారు. గత ఏడాది జూన్ 23న 93ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయనకు పద్శశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల భద్రాద్రి దేవస్థానం అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం ఈవో బి.శివాజీ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి రామక్షేత్రంలో నాదస్వర విద్వాంసులుగా బాధ్యతలు నిర్వహించిన హసన్సాహెబ్కు పద్మశ్రీ అవార్డు రావడంతో జాతీయస్థాయిలో మరోసారి భద్రాద్రి ఖ్యాతి నిలిచిందన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కూడా హసన్సాహెబ్కు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కాగా అవార్డును స్వీకరించేందుకు ఆయన మనవడైన హీలంషావుద్దీన్ తన తండ్రి షేక్మీరాబాబుతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. పద్మశ్రీ పురస్కారం దక్కడం పట్ల హసన్ సాహెబ్ చిన్న కుమారుడు షేక్ ఖాసీంబాబు సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఆయన జీవించి ఉన్నప్పుడు ఇచ్చివుంటే మరింత బాగుండేదని అన్నారు.