Atmakur By Election: మేకపాటి విక్రమ్ రెడ్డికి బీ-ఫామ్ ఇచ్చిన వైసీపీ అధినేత జగన్
ABN , First Publish Date - 2022-06-02T02:44:53+05:30 IST
ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్రెడ్డి (Mekapati Vikram Reddy) ని బరిలోకి దింపాలని సీఎం జగన్ (CM Jagan) నిర్ణయం తీసుకున్నారు.
అమరావతి: ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్రెడ్డి (Mekapati Vikram Reddy) ని బరిలోకి దింపాలని సీఎం జగన్ (CM Jagan) నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు జగన్ను విక్రమ్రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా విక్రమ్రెడ్డికి జగన్, బీ-ఫామ్ ఇచ్చారు. మాజీమంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి (Mekapati Gautam Reddy) ఆకస్మిక మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ముందుగా గౌతమ్రెడ్డి సతీమణికే ఆత్మకూరు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం జరుగుతున్న క్రమంలోనే మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి, మేకపాటి విక్రమ్రెడ్డి జగన్ను కలిశారు. తన రెండో కుమారుడు విక్రమ్రెడ్డికి ఆత్మకూరు టికెట్ ఇవ్వాలని రాజమోహన్రెడ్డి జగన్ కోరినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. సామాజిక సమీకరణలు, పార్టీ అభివృద్ధి ఇలా అన్నింటిని లెక్కేసిన జగన్.. విక్రమ్రెడ్డికే టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
మరోవైపు ఆత్మకూరు ఉప ఎన్నికకు టీడీపీ (TDP) దూరంగా ఉన్నట్లు సమాచారం. మేకపాటి కుటుంబ సభ్యులకే టికెట్ ఇవ్వడంతో సంప్రదాయాన్ని పాటించాలని టీడీపీ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. గతంలో బద్వేలు ఉప ఎన్నికలోనూ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. బీజేపీ మాత్రం తమ అభ్యర్థిని బరిలోకి దింపుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆత్మకూరు ఉప ఎన్నికకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 23న పోలింగ్, 26న ఫలితాలు విడుదల చేస్తారు.