వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-09-07T17:37:44+05:30 IST
సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా..
కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య
నర్మెట: సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య అన్నారు. సోమవారం ఆయన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది హజరును పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించి జిల్లా కేంద్రంలోని డయాగ్నోస్టిక్ కేంద్రానికి పంపించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ముందస్తుగా మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చి లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి ఆర్టీపీసీఆర్ పరీక్షకు జిల్లా కేంద్రానికి పంపాలన్నారు.
అనంతరం మండలంలోని అమ్మాపురం గ్రామాన్ని సందర్శించి రహదారి పక్కన మొక్కలు నాటారు. హరితహరం లక్ష్యాన్ని సాధించాలన్నారు. అనంతరం మండలంలోని హన్మంతాపూర్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులను థర్మల్ స్కానర్తో పరీక్షించి అనుమతించాలన్నారు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్రావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి ఎ.మహేందర్, డీఆర్డీవో రాంరెడ్డి, ఎంపీడీవో ఖాజామొయినోద్దిన్, ఎంపీవో గఫూర్ తదితరులు పాల్గొన్నారు.