Mangaluruలో డ్రగ్స్ విక్రయిస్తున్న 12 మంది Kerala విద్యార్థుల అరెస్ట్
ABN , First Publish Date - 2022-07-10T16:36:36+05:30 IST
దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరులో డ్రగ్స్ విక్రయిస్తూ 12 మంది విద్యార్థులు పట్టుబడ్డారు. మంగళూరులో శనివారం సీసీబీ ఇన్స్పెక్టర్
బెంగళూరు, జూలై 9 (ఆంధ్రజ్యోతి): దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరులో డ్రగ్స్ విక్రయిస్తూ 12 మంది విద్యార్థులు పట్టుబడ్డారు. మంగళూరులో శనివారం సీసీబీ ఇన్స్పెక్టర్ మహే్షప్రసాద్, సబ్ఇన్స్పెక్టర్ రాజేంద్ర వివరాలను మీడియాకు తెలిపారు. పట్టుబడిన వారంతా కేరళ రాష్ట్రానికి చెందినవారు కాగా మంగళూరులోని రెండు కళాశాలలో చదువుతున్నారని పేర్కొన్నారు. వీరిలో శానూఫ్ అబ్దుల్గఫూర్(21), మహమ్మద్ రసీన్(22), గోకుల కృష్ణన్(22), శారూన్ ఆనంద్(19), అనంతు కేపీ(18), అమల్(21), అభిషేక్(21), నిదాల్ (21), శాహీద్ ఎంటీపీ(22), ఫహాద్ హబీబ్(22), మహమ్మద్ రిషీన్(22), రిజిన్ రియాజ్(22) ఉన్నారు. వీరిలో 9 మంది విద్యార్థులు యనపోయ కళాశాలకు చెందినవారని, మిగిలిన ముగ్గురు ఇందిరా నర్సింగ్ కళాశాలకు చెందినవారని తెలిపారు. వారిలో 8 మంది విద్యార్థులు బీబీఏ, బీసీఏ, ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారని వివరించారు. ఓ విద్యార్థి బీబీఏ తొలి సంవత్సరం విద్యార్థి కాగా మిగిలిన ముగ్గురిలో ఒకరు నర్సింగ్ మరొకరు రేడియాలజీ, ఇంకొకరు అలైడ్ సైన్స్ డిగ్రీ కోర్సులు చదువుతున్నట్లు చెప్పారు. వీరు తోటి కళాశాల విద్యార్థులతో పాటు ఇతరులకు డ్రగ్స్తో పాటు గంజాయిని విక్రయిస్తున్నట్లు సీసీబీకు పక్కా సమాచారం వచ్చిన మేరకు దాడులు జరిపామని తెలిపారు. వెలెన్సియా సూటర్ పేట మూడో క్రాస్లోని హాస్టల్పై దాడి చేసి విద్యార్థులను అరెస్టు చేశామన్నారు. వీరి నుంచి రూ. 20 వేల విలువైన 900 గ్రాముల గంజాయిని, స్మోకింగ్ పైప్, రోలింగ్ పేపర్, రూ.4500 నగదు, 11 మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వీటంతటి విలువ రూ. 2.85 లక్షలుగా ఉంటుందన్నారు. కాగా ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ముర్షీద్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడిన 12 మందిలో 11 మంది గంజాయి సేవించినట్లు వైద్యపరీక్షలలో తేలిందన్నారు.