మండలానికో మెగా పార్కు!
ABN , First Publish Date - 2021-06-23T08:57:40+05:30 IST
గ్రామాల్లో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలను పోలిన మెగా పార్కులను ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం
హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలను పోలిన మెగా పార్కులను ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మెగా పార్కు పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. సీఎం కేసీఆర్ ఇటీవల ప్రగతి భవన్ లో నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల సమీక్ష సందర్భంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 10 ఎకరాల స్థలంలో ఈ మెగా పార్కులను నిర్మించాలని, స్థలాభావం ఉంటే కనీసంగా 5 ఎకరాలకు తగ్గని స్థలంలో వీటిని నిర్మించాలని అధికారులకు సూచించారు. ఇందు కోసం ప్రభుత్వ స్థలాలను ఉపయోగించుకోవాలని, ఈ భూములు అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయంగా సేకరణ చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మెగా పార్కులలో అన్ని రకాల మొక్కలు, నడక దారులు, చిన్నారులకు ఆట స్థలాలు, తాగు నీరు, మరుగుదొడ్డి సౌకర్యం వంటివి ఏర్పాటు చేయనున్నారు. స్థలాలను గుర్తించి, సేకరించే బాధ్యతలను రెవెన్యూ అధికారులు చేపడతారు. మొక్కల పెంపకానికి గుంతలు తీయడం, మొక్కలు నాటడం, ప్రహరీ నిర్మాణం వంటి పనులకు ఉపాధి హామీ పథకాన్ని కూడా వినియోగించుకోనున్నారు.
28న మంత్రులు, ప్రజాప్రతినిధులతో సీఎం భేటీ
జులై 1 నుంచి పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాన్ని మరో మారు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ నెల 28న మరో మారు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.