అప్పు తీర్చమని అడిగిన పాపానికి ప్రాణాలు కోల్పోయాడు..! Brooklynలో దారుణం!
ABN , First Publish Date - 2021-10-05T02:48:49+05:30 IST
అప్పు తీర్చమని అడిగిన పాపానికి ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. కేవలం 40 డాలర్లు చెల్లించమని అడిగినందుకే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: అప్పు తీర్చమని అడిగిన పాపానికి ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. కేవలం 40 డాలర్లు చెల్లించమని అడిగినందుకే అతడు ప్రాణాలు కోల్పోయాడు. న్యూయార్క్ నగరంలోని బ్రూక్లిన్ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. పిట్కిన్ అవెన్యులో ఉండే సామ్యుయెల్ అనే వ్యక్తి శుక్రవారం ఓ భవనంపై సృహ లేకుండా పడి ఉన్న విషయాన్ని గుర్తించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే..వైద్యులు మాత్రం శామ్యూల్ అప్పటికే మృతి చెందినట్టు పేర్కొన్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నాడు బ్రూక్స్ బెయిలీ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో సామ్యూల్ హత్య గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శామ్యూల్ అంతకుమునుపే బ్రూక్స్కు 40 డాలర్లు అప్పు ఇచ్చినట్టు బయటపడింది. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమని కోరడంతో బ్రూక్స్ ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. శ్యామ్యూల్ గతంలో డ్రగ్స్కు బానిసైనట్టు అతడి కుటుంబసభ్యులు తెలిపారు. ఈ వ్యసనం కారణంగానే అతడు చెడుసాంగత్యం పంచన చేరాడని కూడా పేర్కొన్నారు. అయితే..ఈ వ్యససాన్ని వదిలి పెట్టేందుకు శామ్యూల్ ప్రయత్నిస్తున్నాడని, ఇలాంటి సమయంలో అతడు హత్యకు గురికావడం తమను కలిచి వేస్తోందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.