మల్కాజిగిరి ఏసీపీ అరెస్టు.. కోర్టులో హాజరుపర్చనున్న అధికారులు
ABN , First Publish Date - 2020-09-24T16:39:23+05:30 IST
అక్రమాస్తుల కేసులో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గురువారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు విచారణను ఎదుర్కొంటున్న మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి.. సుమారు రూ.70 కోట్ల ఆస్తు లు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అంచనాకు వచ్చారు. బుధవారం అతని నివాసంతోపాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి దీనిని గుర్తించారు. ఏసీబీ అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి మహేంద్రహిల్స్లోని నర్సింహారెడ్డి నివాసంతోపాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాలు, వరంగల్, జనగాం, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో, ఏపీలోని అనంతపురంలో సోదాలు నిర్వహించారు. మొత్తంగా తెలంగాణ, ఏపీలోని 25 వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. మహేంద్రహిల్స్ త్రిమూర్తి కాలనీలోని నర్సింహారెడ్డి నివాసంలో ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, డీఎస్పీ సత్యనారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం తనిఖీలు జరిపింది.
ఏసీబీ సోదాల్లో నర్సింహారెడ్డికి 3 ఇళ్లు, 5 ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య స్థలాలతో పాటు రూ.5 కోట్ల విలువైన ఆస్తులు, బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఉన్నట్లుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మరో బృందం ఉప్పల్లోని మల్కాజిగిరి ఏసీపీ కార్యాలయంలో రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు జరిపింది. దీంతోపాటు నర్సింహారెడ్డికి బినామీగా భావిస్తున్న ఉప్పల్లో నివసించే ఓ ఏఎస్ఐ ఇంట్లోనూ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. మరోవైపు మేడిపల్లి, ఉప్పల్లోని నర్సింహారెడ్డి దగ్గరి బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. జనగామ జిల్లాలోనూ 3 చోట్ల తనిఖీలు నిర్వహించారు. లింగాలఘణపురం మండలం వడ్డిచర్లలో నర్సింహారెడ్డి అత్తవారింట్లో, బచ్చన్నపేట మండలంలోని కట్కూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి బండి చంద్రారెడ్డి నివాసంలో, రఘునాథపల్లి మండలంలోని కుర్చపల్లిలోని ఏసీపీ ప్రైవేటు డ్రైవర్ పోరెడ్డి తిరుపతిరెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.