ఐపీఎల్ 2022: మహారాష్ట్రలో లీగ్ మ్యాచ్‌లు.. గుజరాత్‌లో ప్లే ఆఫ్స్!

ABN , First Publish Date - 2022-01-31T03:06:10+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈసారి భారత్‌లోనే జరగబోతోందని బీసీసీఐ ఇప్పటికే తన వైఖరి

ఐపీఎల్ 2022: మహారాష్ట్రలో లీగ్ మ్యాచ్‌లు.. గుజరాత్‌లో ప్లే ఆఫ్స్!

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈసారి భారత్‌లోనే జరగబోతోందని బీసీసీఐ ఇప్పటికే తన వైఖరి వెల్లడించింది. మ్యాచ్‌లు ప్రారంభమయ్యే సమయానికి దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తోంది. అలా కాని పక్షంలో స్టాండ్‌బైగా యూఏఈ, శ్రీలంకను ఎంచుకుంది. అయితే, ఫ్రాంచైజీలు మాత్రం దక్షిణాఫ్రికా వైపు మొగ్గు చూపుతుండగా, ఆ దేశ క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. యూఏఈ కంటే చవగ్గానే తాము ఐపీఎల్ నిర్వహిస్తామని ప్రతిపాదనలు పంపినట్టు వార్తలు వచ్చాయి. 


అయితే, బీసీసీఐ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్‌లోనూ ఐపీఎల్ నిర్వహించాలని పట్టుదలగా ఉంది. కరోనా నేపథ్యంలో ఎంపిక చేసిన మైదానాల్లోనే మ్యాచ్‌లు నిర్వహించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా లీగ్ మ్యాచ్‌లను మహారాష్ట్రలో నిర్వహించి, ప్లే ఆఫ్ మ్యాచ్‌లను గుజరాత్‌లో నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. 


లీగ్ మ్యాచ్‌లకు మహారాష్ట్రను ఎంచుకోవడం వెనక కూడా ఓ కారణం ఉంది. మహారాష్ట్రలో ఎక్కువ సంఖ్యలో స్టేడియాలు అందుబాటులో ఉన్నాయి. ముంబైలోని వాంఖడే, బ్రాబౌర్న్ స్టేడియాలతోపాటు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, పూణే సమీపంలో మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ లీగ్ మ్యాచ్‌లు నిర్వహించి.. ప్లేఆఫ్ మ్యాచ్‌లను అహ్మదాబాద్‌లోని నరేంద్ర‌మోదీ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే, లీగ్ మ్యాచ్‌లకు 25 శాతం మంది ప్రేక్షకులను కూడా అనుమతించాలని యోచిస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2022-01-31T03:06:10+05:30 IST