పాదయాత్రకు జనహారతి
ABN , First Publish Date - 2021-12-05T09:19:18+05:30 IST
అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు నెల్లూరు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి గ్రామంలో వెంకటేశ్వరస్వామి రథానికి పూజలు చేసి, మంగళహారతులు ఇచ్చి, రైతులపై పూలవర్షం కురిపిస్తూ సంఘీభావం తెలుపుతున్నారు. 34వ రోజైన..
- వెంకటగిరి నుంచి గూడూరు నియోజకవర్గంలోకి యాత్ర
నెల్లూరు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు నెల్లూరు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి గ్రామంలో వెంకటేశ్వరస్వామి రథానికి పూజలు చేసి, మంగళహారతులు ఇచ్చి, రైతులపై పూలవర్షం కురిపిస్తూ సంఘీభావం తెలుపుతున్నారు. 34వ రోజైన శనివారం 14 కిలోమీటర్ల పొడవున యాత్ర సాగింది. ఉదయం 9.30 గంటలకు సైదాపురం నుంచి ప్రారంభమైన యాత్ర... తూర్పుకూన్ల రోడ్డు మీదుగా 11గంటలకు గూడూరు మండలంలోకి ప్రవేశించింది. తిప్పవరప్పాడు వద్ద టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డితో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, బీజేపీ, వామపక్షాల నేతలు, ప్రజలు పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు. మధ్యాహ్నం ఒంటిగంటకు చెమిర్తి, సాయం త్రం 5.30 గంటలకు పుట్టమరాజుకండ్రిగకు అమరావతి రైతులు చేరుకున్నారు. కందలి, నాయుడుపాళెం, తిరువెంగళాయపల్లి, కొమ్మునేటూరు, చెనుర్తి, తిరుపతిగారిపల్లి వద్ద ప్రజలు వారికి ఘనస్వాగతం పలికారు.
రోప్ పార్టీ సభ్యుడిపై దాడి
గూడూరు సమీపంలోని తిరుపతిగారిపల్లి వద్ద అమరావతి రైతులకు రక్షణగా తాడు పట్టుకుని ఉన్న ప్రైవేటు సెక్యూరిటీ(రోప్ పార్టీ) సిబ్బంది శివపై పోలీసు లు దాడి చేశారు. వెంకటగిరి సీఐ దాడిలో గాయపడిన శివను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. జేఏసీ నేత శివారెడ్డి దాడిని తీవ్రంగా ఖండించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు.