మడికొండ టెక్స్టైల్ పార్కు భేష్
ABN , First Publish Date - 2022-10-12T05:43:42+05:30 IST
మడికొండ టెక్స్టైల్ పార్కు భేష్
కువైట్ మాజీ స్పీకర్ ఒమర్ అల్ అజ్మీ
మడికొండ, అక్టోబరు 11: మడికొండ శివారులోని కాకతీయ టెక్స్టైల్ పార్కును మంగళవారం కువైట్ దేశ పార్లమెంట్ మాజీ స్పీకర్ ఒమర్ అల్ అజ్మీ సందర్శించారు. ప్రభుత్వ సహకారంతో టెక్స్టైల్ పార్కులో 364 యూనిట్లను ఏర్పాటు గాను 160 యూనిట్లలో వస్త్ర ఉత్పత్తి జరుగుతోంది. అందులో కొన్ని యూనిట్లలో వస్త్రాల తయారీని, వాటి నాణ్యతను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకతీయ వీవర్స్ సొసైటీ అధ్యక్షుడు దర్గాస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఒమర్ ఆల్ అజ్మీ మాట్లాడారు. ఇండో- కువైట్ సహకారంతో టెక్స్టైల్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంలో భాగంగా ఇక్కడ జరుగుతున్న వస్త్ర ఉత్పత్తిని, నాణ్యతను పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. కువైట్లో ప్రభుత్వ సంస్థలలో పని చేసే ఉద్యోగులకు కావాల్సిన బట్టల కోసం ఆర్డర్లు ఇచ్చి తమకు కావాలసిన నాణ్యతతో కూడిన బట్టను తయారు చేసినట్టయితే భవిష్యత్తులో మడికొండ టెక్స్టైల్ పార్కుకు పెద్దఎత్తున ఆర్డర్లు ఇచ్చి ఇక్కడ తయారైన బట్టను తామే కొనుగోలు చేస్తామని ఒమర్ అల్ అజ్మీ తెలిపారు.
అల్రాజా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎమ్డీ అభినవ్ అల్లాడి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రషీద్ బిన్ సయీద్ అల్హడీ, అపోలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కొత్త అర్జున్ రెడ్డి, టెక్స్టైల్ వ్యాపారవేత్త నవనీత్ అగర్వాల్ స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు.