చుక్కల్ని చూడలేం.. వెన్నెలని ఆస్వాదించలేం!
ABN , First Publish Date - 2022-01-10T07:31:23+05:30 IST
శరద్రుతువు..! మంచి వెన్నెల కాస్తుంది. కానీ, గత రెండునెలలుగా శరత్కాలం ఉన్నా.. హైదరాబాదీలు వెన్నెలను ఆస్వాదించలేకపోయారు.
హైదరాబాద్ను కమ్మేస్తున్న కాంతి కాలుష్యం
సీయూటీఎం అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): శరద్రుతువు..! మంచి వెన్నెల కాస్తుంది. కానీ, గత రెండునెలలుగా శరత్కాలం ఉన్నా.. హైదరాబాదీలు వెన్నెలను ఆస్వాదించలేకపోయారు. ప్రస్తుతం హేమంత రుతువు..! ఓవైపు మంచు కురుస్తున్నా.. వినీలాకాశంలో రాత్రిళ్లు చుక్కలు ముచ్చటగా కనిపించాలి. కానీ, హైదరాబాద్ నగరంలో ఆ పరిస్థితులు అస్సలు లేవు. ఇందుకు కారణం కాంతి కాలుష్యం..! అవును.. ఇది నిజం..! విద్యుత్తు కాంతులు, వీధి దీపాల వెలుగులు, బహుళ అంతస్తుల భవనాల నుంచి వెలువడే ఎల్ఈడీ కాంతులు హైదరాబాద్ నగరంలో గగనానికి.. భువనానికి మధ్య తిమిరంలా పరుచుకుపోతున్నాయి. అలా ఏర్పడుతున్న కాంతి కాలుష్యం రాత్రిళ్లు ఆకాశంలో చందమామ, నక్షత్రాలు, తోకచుక్కలు, ఉల్కలను కనిపించకుండా చేస్తున్నాయి. ఒడిసా రాష్ట్రం భువనేశ్వర్లోని సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్(సీయూటీఎం) సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ శివప్రసాద్ మిశ్రా నేతృత్వంలోని బృందం దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో చేపట్టిన అధ్యయనంలో కాంతికాలుష్యంలో హైదరాబాద్ టాప్ అని తేలింది.
ఈ పరిస్థితి 2014 నుంచి ప్రారంభమైందని ఈ అధ్యయనం వివరించింది. ఇటీవల ఈ అధ్యయనం ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అడ్వాన్స్డ్ రీసర్చ్లో ప్రచురితమైంది. విద్యుత్తు వెలుగుల ద్వారా కమ్ముకునే కాంతి/కాంతి కాలుష్యాన్ని ప్రకాశించే తీవ్రత(యూనిట్ ఆఫ్ లూమినస్ ఇంటెన్సిటీ)తో కొలుస్తారు. సీయూటీఎం అధ్యయనంలో ఈ తీవ్రత హైదరాబాద్ నగరంలో ప్రతి చదరపు కిలోమీటర్కు 7,790 యూనిట్లుగా ఉంది. కోల్కతా(7,480 యూనిట్లు), ఢిల్లీ(7,270 యూనిట్లు)నగరాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. శాటిలైట్ చిత్రాల ద్వారా ఎనిమిది ప్రధాన నగరాల్లో లూమినస్ ఇంటెన్సిటీని గుర్తించామని సీయూటీఎం అధ్యయనం వెల్లడించింది. హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో చెన్నై, ముంబై, అహ్మదాబాద్ ఉండగా.. భువనేశ్వర్ 2,910 యూనిట్లతో చివరిస్థానంలో నిలిచింది. 2014-17 మధ్యకాలంలో ఈ అధ్యయనాన్ని చేపట్టినట్లు ప్రొఫెసర్ శివప్రసాద్ మిశ్రా తెలిపారు. అంతకుముందు కాలంతో పోలిస్తే.. 2014-17లో హైదరాబాద్, చెన్నై, ముంబై, అహ్మదాబాద్లలో కాంతి కాలుష్యం 102ు పెరిగిందని వివరించారు. హైదరాబాద్లో ఎల్ఈడీ లైట్ల వినియోగం పెరగడం వల్ల కాంతి కాలుష్యం ఎక్కువైందని విశ్లేషించారు.
పర్యావరణానికి తీవ్ర ముప్పు..!
దేశంలో మితిమీరిన స్థాయిలో ఎల్ఈడీ లైట్ల వినియోగం జరుగుతోందని, దీంతో భారీమొత్తంలో కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. 43ు కాంతి కాలుష్యానికి వీధి దీపాలు, హైవేల మీద లైట్లే కారణమని అంటున్నారు. కర్ణాటకలోని మణిపాల్, తమిళనాడులోని కొడైకెనాల్, మహారాష్ట్రలోని నిసర్గ్శాలతో పాటు ఇంకొన్ని ప్రాంతాల నుంచి రాత్రిళ్లు వినీలాకాశం స్పష్టంగా కనిపిస్తుందని తాజా అధ్యయనంలో గుర్తించారు.