అబద్ధపు ప్రచారానికి గుణపాఠం: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-12-05T09:30:31+05:30 IST

సీఎం కేసీఆర్‌ తప్పుడు ఆరోపణలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.

అబద్ధపు ప్రచారానికి గుణపాఠం: కిషన్‌రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజీనామా చేయాలి: లక్ష్మణ్‌

రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు ఇక కాలం చెల్లినట్లే: డీకే అరుణ

హైదరాబాద్‌, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ తప్పుడు ఆరోపణలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. 2023లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ ఎన్నికలు తమకు ప్లాట్‌ఫామ్‌లా ఉపయోగపడతాయని అన్నారు. చివరి రెండు గంటల్లో పోలింగ్‌ పారదర్శకంగా జరిగి ఉంటే బీజేపీ మేయర్‌ పీఠం గెలుచుకుని ఉండేదన్నారు.


 కేసీఆర్‌, కేటీఆర్‌ నాయకత్వాన్ని హైదరాబాద్‌ ఓటర్లు తిరస్కరించారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. దీనికి బాధ్యత వహించి సీఎం రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ మైత్రిని ప్రజలు గుర్తించారన్నారు. బీజేపీ నూతన ఒరవడి సృష్టించిందని పేర్కొన్నారు.


 పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ వంద సీట్లు తమవేనని చెప్పుకొన్న టీఆర్‌ఎ్‌సకు చావుతప్పి కన్నులొట్టబోయినట్లయిందన్నారు. ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారని కొనియాడారు. టీఆర్‌ఎ్‌సకు కాలం చెల్లినట్లేనని, కేసీఆర్‌, కేటీఆర్‌ రోజులు లెక్కబెట్టుకోవాలని అన్నారు.

కేసీఆర్‌ జిమ్మిక్కులను ప్రజలు గుర్తించారని మాజీ ఎంపీ వివేక్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో కారుకు సన్‌స్ట్రోక్‌ తగిలితే, కమలానికి సన్‌రైజ్‌ జరిగిందని సంజయ్‌ వ్యాఖ్యానించారు. ఈ స్థాయిలో తమను ప్రోత్సహించిన నగర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. 


Updated Date - 2020-12-05T09:30:31+05:30 IST