రైతులపై లాఠీ
ABN , First Publish Date - 2022-08-20T09:38:40+05:30 IST
నిజామాబాద్ జిల్లా సిరికొండకు చెందిన పలువురు రైతులపై అటవీశాఖ సిబ్బంది శుక్రవారం లాఠీలు ఝళిపించారు.
భూమిని చదును చేస్తున్న అన్నదాతల అడ్డగింత
ఆపై వారిని చితకబాదిన అటవీ శాఖ సిబ్బంది
సిరికొండ, ఆగస్టు 19: నిజామాబాద్ జిల్లా సిరికొండకు చెందిన పలువురు రైతులపై అటవీశాఖ సిబ్బంది శుక్రవారం లాఠీలు ఝళిపించారు. వ్యవసాయ భూమిని చదును చేసుకుంటున్న వారిని అడ్డుకుని చితకబాదారు. సిరికొండలోని 532 సర్వే నెంబర్లోని భూమికి 166 మంది రైతులకు 12ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. పట్టాలు పొందిన రైతులు నాటి నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు రైతులు శుక్రవారం ఆ భూమిని చదును చేస్తుండగా అటవీ శాఖ సిబ్బంది అడ్డుకున్నారు. సదరు భూమి అటవీ శాఖదని, ఎట్టి పరిస్థితుల్లో సాగుకు అనుమతించమని స్పష్టం చేశారు. తమ వద్ద పట్టాలు ఉన్నాయని రైతులు చెబుతున్నా పట్టించుకోకుండా.. పలువురిని చితకబాదారు. దీంతో ఆగ్రహించిన రైతులు మూకుమ్మడిగా సిరికొండ పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి(డీఆర్ఓ) గంగారాం పోలీసు స్టేషన్కు చేరుకొని సీఐ చంద్రశేఖర్ సమక్షంలో రైతులకు క్షమాపణ చెప్పారు. దీంతో శాంతించిన రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.