జెండా ఎగురవేతను అడ్డుకున్న కుటుంబం..

ABN , First Publish Date - 2021-01-27T05:00:47+05:30 IST

జెండా ఎగురవేతను అడ్డుకున్న కుటుంబం..

జెండా ఎగురవేతను అడ్డుకున్న కుటుంబం..
అంబేద్కర్‌ విగ్రహం వద్ద పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలుపుతున్న బాధిత కుటుంబం

స్థలం తమదే అంటూ పురుగుల మందు డబ్బాలతో నిరసన

నల్లబెల్లి, జనవరి 26: అంబేద్కర్‌ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఎగురవేయడాన్ని ఓ కుటుంబం అడ్డుకుని, పురుగుల మందు డబ్బాలతో ధర్నా చేపట్టగా, అది ప్రభుత్వ భూమి అంటూ పోటీగా దీక్ష చేపట్టిన ఘటన రేలకుంటలో మంగళవారం చోటుచేసుకుంది. ఇరువర్గాలు, స్థానికుల కథనం ప్రకారం. అంబేద్కర్‌ విగ్రహం ఎదుట జెండాను ఎగురవేయడానికి కొంద రు స్థానికులు వచ్చారు. విగ్రహ ఏర్పాటు భూమి తనకు చెందినదని, అదే గ్రామానికి చెందిన కూచన బాబు అతని కుటుంబసభ్యులు జెండాను ఎగురవేయకుండా అడ్డుకున్నారు. తాను కొనుగోలు చేసిన భూమిలో కొందరు అంబేద్కర్‌ విగ్రహం నెలకొల్పి ఆక్రమణలకు పాల్పడుతున్నారని బాబు ఆరోపించారు. తమ భూమి తమకే చెందాలని, ఎవరైనా అడ్డు తగిలితే ఆత్మహత్య చేసుకుంటామంటూ పురుగుల మందు డబ్బాలతో హెచ్చరించారు. ఇదిలాఉంటే ప్రభుత్వ స్థలంలో నెలకొల్పిన విగ్రహం ఎదుట జాతీయ జెండాను ఎగురవేయకుండా అడ్డుకున్న బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ స్థానికులు గాజర్ల అంకూస్‌, జన్ను రవి తదితరులు రహదారి పక్కన టెంట్‌ వేసి నిరసన దీక్ష చేపట్టారు. ఎస్సై వెంకటేశ్వర్లు ఇరువర్గాలతో చర్చించి శాంతింపజేశారు.

Updated Date - 2021-01-27T05:00:47+05:30 IST