భారత్, బంగ్లాదేశ్ అక్రమ నివాసితుల విషయంలో కువైట్ కీలక నిర్ణయం !
ABN , First Publish Date - 2020-04-10T16:02:24+05:30 IST
తమ దేశంలో ఉంటున్న భారత్, బంగ్లాదేశ్ అక్రమ నివాసితుల విషయంలో కువైట్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
కువైట్: తమ దేశంలో ఉంటున్న భారత్, బంగ్లాదేశ్ అక్రమ నివాసితుల విషయంలో కువైట్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్లో భారత్, బంగ్లాదేశ్లకు చెందిన అక్రమ నివాసితులను బహిష్కరించేందుకు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాచరణ రూపొందించింది.ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ శనివారం నుంచి బంగ్లాదేశ్ నిర్వాసితుల బహిష్కరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపింది. భారతీయ నిర్వాసితులకు ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 20 వరకు బహిష్కరణ ప్రక్రియ ఉంటుందని చెప్పింది.
చట్టవిరుద్ధంగా కువైట్లో ఉంటున్న నివాసితులను ఎటువంటి జరిమానా విధించకుండా దేశం నుంచి బహిష్కరించాలన్న కేబినెట్ నిర్ణయం మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రజా సంబంధాలు మరియు భద్రతా మంత్రిత్వ శాఖ తన పత్రికా ప్రకటనలో పేర్కొంది. కాగా, ప్రస్తుతం బహిష్కరించబడినవారు భవిష్యత్తులో సంబంధిత అధికారులతో సమన్వయం తరువాత తిరిగి కువైట్కు రావొచ్చని తెలిపింది. ఇక నిష్క్రమణ పెండింగ్లో ఉన్న నిర్వాసితుల కోసం మంత్రిత్వశాఖ తాత్కాలికంగా బస కూడా ఏర్పాటు చేసింది.
మగవారి కోసం అల్-ఫర్వానియా ప్రాధమిక పాఠశాల(బాలికలు), ఏరియా 1, సెయింట్ 76లో, మహిళల కోసం అల్-ముత్తన్న ప్రాథమిక పాఠశాల (బాలురు), ఏరియా 1, సెయింట్ 122లో తాత్కాలిక బస ఏర్పాటు చేసింది. ఉదయం 8.00 నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు బహిష్కరించబడిన వారి కోసం ఈ తాత్కాలిక బస కేంద్రాలు తెరిచి ఉంటాయని అధికారులు తెలియజేశారు.