ఢిల్లీలోని కువైట్ ఎంబసీ.. రంజాన్ ఫుడ్ కిట్స్ పంపిణీ
ABN , First Publish Date - 2021-05-12T15:01:58+05:30 IST
పవిత్ర రంజాన్ మాసంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో చాలా కుటుంబాలకు ఫుడ కిట్స్ పంపిణీ చేసినట్లు ఢిల్లీలోని కువైట్ ఎంబసీ మంగళవారం వెల్లడించింది.
న్యూఢిల్లీ: పవిత్ర రంజాన్ మాసంలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో చాలా కుటుంబాలకు ఫుడ కిట్స్ పంపిణీ చేసినట్లు ఢిల్లీలోని కువైట్ ఎంబసీ మంగళవారం వెల్లడించింది. కువైట్ అవకాఫ్ పబ్లిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఎంబసీ పేర్కొంది. ఇండియాలోని వివిధ స్వచ్ఛంద సంస్థల సహాయంతో వేర్వేరు రాష్ట్రాల్లో పేదలకు సుమారు 1,660 ఫుడ్ కిట్స్ పంపిణీ చేసినట్లు రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు. కరోనా వల్ల విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న ఈ సమయంలో భారత్లోని పేద ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన కువైట్ ప్రజలకు, కువైట్ అవకాఫ్ పబ్లిక్ ఫౌండేషన్కు రాయబారి జస్సెం అల్ నజేం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ప్రతి ఏడాదిలానే ఈ యేటా కూడా ప్రపంచలోని వివిధ దేశాల్లో పవిత్ర రంజాన్ మాసంలో ఫుడ్ కిట్స్ పంపిణీ చేసినట్లు కువైట్ అవకాఫ్ పబ్లిక్ ఫౌండేషన్ తెలిపింది. ఇక రంజాన్ పండుగను పురస్కరించుకుని కువైట్లోని భారత రాయబారి సిబి జార్జ్ ఆ దేశ ప్రజలకు, భారత ప్రవాసులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కువైట్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాని సబా అల్ ఖలేద్ అల్ హమద్ అల్ సబాకు కూడా రాయబారి ఈద్ అల్ ఫితర్ విషెస్ తెలిపారు.