పోలీసు సోదాలపై కూన రవికుమార్ సతీమణి ప్రమీల ఆవేదన
ABN , First Publish Date - 2021-04-11T16:25:08+05:30 IST
పోలీసు సోదాలపై కూన రవికుమార్ సతీమణి ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ
శ్రీకాకుళం: పోలీసు సోదాలపై కూన రవికుమార్ సతీమణి ప్రమీల ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. రవి లేని సమయంలో 80 మంది పోలీసులు తమ ఇంటిని చుట్టుముట్టారని, దౌర్జన్యంగా ఇంట్లో సోదాలు చేశారని వాపోయారు. ఆరాచకాలను ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని ప్రమీల ప్రశ్నించారు. అధికార పార్టీ చెప్పినట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారని, ఇంట్లో తాను, తన కుమార్తె మాత్రమే ఉన్నామని ప్రమీల తెలిపారు.
రవికుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల పొందూరు మండలం పెనుబర్తిలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డవారిని రవికుమార్ వర్గం ప్రశ్నించేందుకు వెళ్లింది. అదేసమయంలో అక్కడే ఉన్న పోలీసుల బలగాలను కూడా రవికుమార్ ప్రశ్నించారు. దీనిపై డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవికుమార్, అతని సోదరుడితోపాటు మరో 60 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం రవికుమార్ ఇంటిని పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. తనిఖీల్లో రవికుమార్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.