హైదరాబాద్: తెలంగాణకు మంజూరైన ఐటీఐఆర్ను రక్షించడంలో కేటీఆర్ విఫలమయ్యారని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే కేటీఆర్ నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. గోబెల్స్ ప్రచారంతో పట్టభద్రులను కేటీఆర్ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఐటీఐఆర్ కోసం లేఖ రాసినట్లు కేటీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఐటీఐఆర్ను రక్షించడంలో ఎందుకు విఫలమయ్యారని కేటీఆర్ను ఆయన ప్రశ్నించారు.
టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఐటీఐఆర్ నలిగిపోయి లక్షలాది యువకుల నోట్లో మట్టిపడిందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ఎంపీలు ఐటీఐఆర్ కోసం పార్లమెంట్ను ఒక్కరోజు కూడా ఎందుకు స్తంభింప చేయలేదని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ రాసిన లేఖలో ఐటీఐఆర్ కావాలన్న చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. 2018లో ఐటీఐఆర్ పోతే 2021లో కేంద్రానికి కేటీఆర్ లేఖ రాయడం ఎవరిని మోసం చేయడానికని ఆయన ప్రశ్నించారు. జహీరాబాద్ పట్టణానికి ప్రకటించిన నిమ్జ్ ఏమైందని ఆయన నిలదీశారు.