‘తెలుగుగంగ’పై త్వరలో కేఆర్ఎంబీ సమావేశం
ABN , First Publish Date - 2021-12-04T07:33:30+05:30 IST
చెన్నైకి తాగునీటిని అందించే తెలుగుగంగ ప్రాజెక్టుపై కృష్ణా నది యాజమాన్య బోర్డు(కే ఆర్ఎంబీ) త్వరలో సమావేశం కానుంది.
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): చెన్నైకి తాగునీటిని అందించే తెలుగుగంగ ప్రాజెక్టుపై కృష్ణా నది యాజమాన్య బోర్డు(కే ఆర్ఎంబీ) త్వరలో సమావేశం కానుంది. 2021-22 జల సంవత్సరానికి గాను ఈ ఏడాది జూలై నుంచి అక్టోబరు వరకూ 8 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టుకు ఇవ్వాలని ఇదివరకే అంగీకారం జరిగింది.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు వద్ద అక్టోబరు 23 వరకు ఉన్న లెక్కల ప్రకారం.. 5.080 టీఎంసీల నీరు మాత్రమే విడుదలయింది. మిగిలిన టీఎంసీల నీటిని ఏ విధంగా విడుదల చేయాలనే అంశంపై త్వరలో జరిగే సమావేశంలో ఓ నిర్ణయానికి రానున్నారు. చెన్నై తాగునీటి అవసరాలకు 12 టీఎంసీల నీరును అందించడంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. చర్చించాల్సిన అంశాలు ఇంకా ఏమున్నాయో 10లోగా చెప్పాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేంద్ర జలవనరుల సంఘం చీఫ్ ఇంజనీర్లకు కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి డీఎం రాయిపూరే లేఖ రాశారు.