టీడీపీ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర
ABN , First Publish Date - 2021-02-25T22:28:01+05:30 IST
టీడీపీ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర
విజయవాడ: గుంటూరు నగర మేయర్ టీడీపీ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర పేరు ఖరారు చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. ఆయా వార్డుల్లో ఉన్న అభ్యర్థుల వివరాలపై నేతలు చర్చించారు. పశ్చిమ నియోజకవర్గంలో నాలుగు డివిజన్లలోని అభ్యర్థిత్వాలపై ఉన్న సందిగ్ధతపై చర్చించినట్లు సమాచారం. శుక్రవారం ఆయా డివిజన్లలో పోటీచేసిన అభ్యర్థులను పిలిపించాలని నిర్ణయం తీసుకున్నారు. వార్డులవారీగా అభ్యర్థులపై సమావేశంలో టీడీపీ నేతలు చర్చించారు.
పంచాయతీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న టీడీపీ తాజాగా గుంటూరు మేయర్ పీఠంపై కన్నేసింది. దానికి అనుగుణంగా పార్టీ సీనియర్ నాయకుడు కోవెలమూడి రవీంద్రను రంగంలోకి దించిన సంగతి విధితమే. సంవత్సరం క్రితమే ఆయన పూర్తి కసరత్తు చేసి గెలుపు గుర్రాలుగా కార్పోరేటర్ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. కొవిడ్ సమయంలో అనేక సామాజిక కార్యక్రమాలతో ఆయన ప్రజలకు దగ్గరయ్యారు. తాజాగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ప్రజలకు మరింత చేరువయ్యే పనిలో పడ్డారు. ఇష్టారాజ్యంగా పన్నులు, నిత్యావసరాల ధరలు పెంచుకుంటూ పోతూ ప్రజల నడ్డి విరుస్తున్న వైసీపీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కోవెలమూడి పిలుపునిచ్చారు.