విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైసీపీది మొసలి కన్నీరు: కొల్లు రవీంద్ర

ABN , First Publish Date - 2021-03-05T15:27:58+05:30 IST

‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ నినాదంతో మచిలీపట్నంలో బంద్ కొనసాగుతోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైసీపీది మొసలి కన్నీరు: కొల్లు రవీంద్ర

కృష్ణాజిల్లా: ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ నినాదంతో మచిలీపట్నంలో బంద్ కొనసాగుతోంది. వర్తక వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్చంధంగా బంద్‌లో పాల్గొంటున్నాయి. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర కోనేరు సెంటర్‌లో జరిగిన బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వైసీపీ ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ముఖ్యమంత్రి జగన్ అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం వరకు బంద్‌కు సహకరించడం ఏంటని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతామని, విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం తెలుగుదేశం పార్టీ ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.


Updated Date - 2021-03-05T15:27:58+05:30 IST