చిత్తూరు నుంచి కిసాన్ రైలు ప్రారంభించాలి

ABN , First Publish Date - 2021-07-01T06:06:44+05:30 IST

దేశంలోనే జిల్లాస్థాయిలో అత్యధికంగా మామిడిని పండిస్తున్న చిత్తూరు జిల్లా రైతులను ఆదుకునేందుకు ఇక్కడి నుంచి మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల మీదుగా న్యూఢిల్లీకి కిసాన్‌ రైలు...

చిత్తూరు నుంచి కిసాన్ రైలు ప్రారంభించాలి

దేశంలోనే జిల్లాస్థాయిలో అత్యధికంగా మామిడిని పండిస్తున్న చిత్తూరు జిల్లా రైతులను ఆదుకునేందుకు ఇక్కడి నుంచి మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల మీదుగా న్యూఢిల్లీకి కిసాన్‌ రైలు ప్రారంభించేందుకు కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇటీవల కర్ణాటకలోని చింతామణి నుంచి న్యూఢిల్లీకి కిసాన్‌ రైలు ప్రారంభించి ఆ రాష్ట్రంలోని మామిడి రైతులకు ఊరట కలిగించిన రీతిలోనే ఇక్కడి రైతులను కూడ ఆదుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అయిదు లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతుండగా, ఒక్క చిత్తూరు జిల్లాలోనే 2.5 లక్షల ఎకరాల్లో సాగు కావడాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి. జిల్లాలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందువల్ల సన్నకారు రైతులు మామిడి సాగు పట్ల మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో ఏటా సుమారు 12 లక్షల టన్నుల మామిడి దిగుబడి ఉంటోంది. ఇతర రాష్ట్రాల్లో గిరాకీ ఉన్న బెనిషాన్‌, ఖాదర్‌ (ఆల్‌ఫాండో), మల్లిక, ఇమాం పసంద్‌ (హిమాయత్‌), నీలం, తోతాపురి రకాలను ఇక్కడ విరివిగా పండిస్తున్నారు. రైళ్లు విమానాల ద్వారా ఎగుమతులు జరగకపోవడంతో మామిడి మండీల ద్వారా దళారీ విధానంలో రైతాంగం దోపిడీకి గురికాక తప్పడం లేదు. జిల్లాలోని మామిడిగుజ్జు పారిశ్రామికుల సిండికేట్‌ ప్రభావంతో తోతాపురి కాయలకు గిట్టుబాటు ధర లభించనందువల్ల అఖిల భారత కిసాన్‌ సంఘటన చిత్తూరు జిల్లాశాఖ గత 15 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. రైతులను కాపాడేందుకు మామిడి సీజన్‌ పూర్తి అయ్యే లోపు చిత్తూరు నుంచి న్యూఢిల్లీకి ప్రత్యేక మామిడి కిసాన్‌ రైలు ప్రారంభించేందుకు కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలి.

గుండాల రామకృష్ణయ్య

చౌడేపల్లి, చిత్తూరు జిల్లా

Updated Date - 2021-07-01T06:06:44+05:30 IST