Khairatabad : మహా గణపతిం మనసా స్మరామి
ABN , First Publish Date - 2022-08-29T18:14:36+05:30 IST
వినాయక చవితికి మూడు రోజుల ముందుగానే ఖైరతాబాద్ గణనాథుడు సిద్ధమయ్యాడు. బ్రాహ్మణులు నిర్ణయించిన ముహూర్తం మేరకు ఆదివారం ఉదయం
పూజలకు సిద్ధమైన పంచముఖ మహాలక్ష్మీ గణపతి
కంటి శుక్లాల ఏర్పాటు
హైదరాబాద్/ఖైరతాబాద్: వినాయక చవితికి మూడు రోజుల ముందుగానే ఖైరతాబాద్ గణనాథుడు సిద్ధమయ్యాడు. బ్రాహ్మణులు నిర్ణయించిన ముహూర్తం మేరకు ఆదివారం ఉదయం 7.30 నుంచి 8 గంటలలోపు గణపతికి కంటి శుక్లాలను అమర్చడంతో విగ్రహానికి ప్రాణం తెచ్చినట్లయ్యింది. ఆదివారం సాయంత్రం నుంచి గణపతి తయారీ కోసం వాడిన కర్రలను తొలగించే పనులు ప్రారంభమయ్యాయి.
గణపతిపైకి అనుమతి లేదు
68 సంవత్సరాల ఖైరతాబాద్ గణపతి ఉత్సవాల్లో తొలిసారిగా 50 అడుగుల ఎత్తుతో పూర్తి స్థాయిలో మట్టి గణపతిని తయారు చేశారు. ఈసారి గణపతి పైకి ఎక్కేందుకు ఎవరినీ అనుమతించబోమని ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ తెలిపారు. ప్రతిసారి భక్తులు, స్థానిక ఉత్సవ కమిటీ ప్రతినిధులు గణపతి పైకి ఎక్కి పూజలు చేసేవారు. ఈసారి భక్తులు, వీఐపీలు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఎవరైనా గణపతి నిల్చున్న తామరపువ్వు కింది భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణపతి కాళ్లను తాకి పూజలు చేసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గణపతి పక్కనున్న రెండు విగ్రహాల వద్ద ప్రత్యేకంగా ఈసారి చిన్న మొక్కలను నాటి ఎవరూ తాకకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.