ఖబడ్దార్ కేసీఆర్.. నీ పాలనకు కాలం చెల్లింది!
ABN , First Publish Date - 2021-12-26T08:54:34+05:30 IST
గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన రైతులపై లాఠీచార్జి చేయించడం దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
గౌరవెల్లి నిర్వాసితుల శిబిరంలో ఈటల రాజేందర్
అక్కన్నపేట, డిసెంబరు 25: గౌరవెల్లి ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన రైతులపై లాఠీచార్జి చేయించడం దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. శనివారం సిద్దిపేట జిల్లా గౌరవెల్లి భూనిర్వాసితుల దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా లాఠీదెబ్బలతో గెంటేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ‘ఖబడ్దార్ కేసీఆర్.. నీ పాలనకు ఇక కాలం చెల్లింది’ అని హెచ్చరించారు. వచ్చే డిసెంబర్లోపు టీఆర్ఎస్ పాలన అంతం కావడం ఖాయమన్నారు. పరిహారం కోసం పనులను అడ్డుకుంటే కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులు మీకు టెర్రరిస్టుల్లాగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూం ఇంటితో పాటు, 18సంవత్సరాలు నిండిన యువతీ, యువకులకు రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని, పెండింగ్లో ఉన్న 112 ఎకరాలకు పరిహారం చెల్లించి భూసేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు పరిహారం, ప్యాకేజీ డబ్బులు పూర్తిగా చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలన్నారు.