ప్రజలిచ్చిన శక్తితోనే నేనిలా నిలబడ్డాను: కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-02-21T22:12:58+05:30 IST

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణఖేడ్‌ శివారులోని

ప్రజలిచ్చిన శక్తితోనే నేనిలా నిలబడ్డాను: కేసీఆర్‌

నారాయణఖేడ్‌: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం నారాయణఖేడ్‌ శివారులోని అనురాధ కళాశాల మైదానంలో నిర్వహించిన  బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడుతూ 14 ఏళ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. ప్రజలిచ్చిన శక్తితోనే నేనిలా నిలబడ్డానని చెప్పారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామని, రాష్ట్రంలో విద్యుత్‌, నీటి సమస్యలు తీరిపోయాయని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోందని కేసీఆర్‌ పేర్కొన్నారు. రూ.2,653 కోట్ల అంచనాతో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని, రూ.1,774 కోట్ల అంచనాతో బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని నిర్మించనున్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టింది. ఈ ఎత్తిపోతల పథకాలు పూర్తయితే సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లోని 3.84 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందడం ఇక ఖాయమే. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్‌, నారాయణఖేడ్‌లోని 11 మండలాల్లోని 231 గ్రామాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగుకు 12 టీఎంసీల నీళ్లు రానున్నాయి. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా అందోలు, నారాయణఖేడ్‌ నియోజకర్గాల్లోని 8 మండలాల్లోని 166 గ్రామాల్లోని 1.65 లక్షల ఎకరాల సాగుకు 8 టీఎంసీల నీటిని అందించనున్నారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల నిర్మాణాల టెండర్లను మెఘా ఇంజనీరింగ్‌ సంస్థ దక్కించుకున్నది.  

Updated Date - 2022-02-21T22:12:58+05:30 IST