టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీపై కేసీఆర్‌ నజర్‌

ABN , First Publish Date - 2022-01-25T07:38:13+05:30 IST

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ కూర్పు, జిల్లా అధ్యక్షుల ఎంపికపై పార్టీ

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీపై కేసీఆర్‌ నజర్‌

పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై కూడా! 


హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ కూర్పు, జిల్లా అధ్యక్షుల ఎంపికపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు చేసి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల జరిగిన ప్లీనరీలో రాష్ట్ర కమిటీ కూర్పు, జిల్లా అధ్యక్షుల నియామక బాధ్యతలను సీఎం కేసీఆర్‌కే అప్పచెబుతూ తీర్మానాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరుసటి సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనే రాష్ట్ర కమిటీని, పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షులను ఎంపిక చేసే పనిలో కేసీఆర్‌ తలమునకలుగా ఉన్నారు.


వాస్తవానికి 2018 ఎన్నికలకు ముందు నుంచే పార్టీ జిల్లా కమిటీలకు అధ్యక్షులు లేరు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లేని చోట్ల నియోజకవర్గ ఇన్‌చార్జిలు క్షేత్రస్థాయిలో సమన్వయ బాధ్యతలు చూస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో విపక్షాలను దీటుగా ఎదుర్కొనేందుకు జిల్లా అధ్యక్షుల నియామకాలను సీఎం కేసీఆర్‌ మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నట్లు తెలిసింది.


ఇదిలా ఉండగా.. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రం తరపున ఏమేమి అంశాలు లేవనెత్తాలన్న దానిపైనా ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షలు చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల అంచనాల్లో స్పష్టత రాగానే ఆ మొత్తాన్నీ కలుపుకుని బడ్జెట్‌కు రూపు తేనున్నట్లు టీఆర్‌ఎస్‌ ముఖ్యులు తెలిపారు.


Updated Date - 2022-01-25T07:38:13+05:30 IST