కేంద్రంతో కేసీఆర్ కాళ్ల బేరం: మధుయాష్కి
ABN , First Publish Date - 2020-12-12T22:31:59+05:30 IST
కేంద్రంతో సీఎం కేసీఆర్ కాళ్ల బేరం చేసుకుంటున్నారని కాంగ్రెస్ నేత మధుయాష్కి ఎద్దేవాచేశారు. దేవుడినైనా ఎదురిస్తానన్న కేసీఆర్ కేంద్రంతో కాళ్ల బేరానికి వెళ్లారని విమర్శించారు.
హైదరాబాద్: కేంద్రంతో సీఎం కేసీఆర్ కాళ్ల బేరం చేసుకుంటున్నారని కాంగ్రెస్ నేత మధుయాష్కి ఎద్దేవాచేశారు. దేవుడినైనా ఎదురిస్తానన్న కేసీఆర్ కేంద్రంతో కాళ్ల బేరానికి వెళ్లారని విమర్శించారు. అధికారులు లేకుండా కేంద్రమంత్రి అమిత్షాతో కేసీఆర్ భేటీ వెనుక అర్ధం ఏంటి? అని మధుయాష్కీ ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి కాంగ్రెస్ను దొంగ దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి కేసీఆర్ మేయర్ పదవి ఆఫర్ చేశాడని ప్రచారం జరుగుతోందని చెప్పారు. కేసీఆర్ మంత్రివర్గం అలీబాబా నలభై దొంగలుగా మారిందని ధ్వజమెత్తారు. ఎఫ్ఐఆర్ నమోదైన మంత్రి మల్లారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భూకబ్జాలు చేస్తోన్న ఎమ్మెల్యేలు, మంత్రులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రజలే కేసీఆర్ గడీలను బద్దలు కొడతారని మధుయాష్కి హెచ్చరించారు.