కవిత రెండు చోట్ల ఓటు వేశారు

ABN , First Publish Date - 2020-12-02T07:53:15+05:30 IST

నిజామాబాద్‌ జిల్లా పొతంగల్‌లో తన ఓటును వదులుకోకుండానే జూబ్లీహిల్స్‌ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మంగళవారం ఓటు వేశారని రాష్ట్ర

కవిత రెండు చోట్ల ఓటు వేశారు

ఆమె ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయండి..

ఎస్‌ఈసీకి ఇందిరా శోభన్‌ ఫిర్యాదు

హైదరాబాద్‌, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ జిల్లా పొతంగల్‌లో తన ఓటును వదులుకోకుండానే జూబ్లీహిల్స్‌ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మంగళవారం ఓటు వేశారని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ ఫిర్యాదు చేశారు. ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘన అని, తక్షణమే ఆమె ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథికి ఈ మెయిల్‌ ద్వారా ఫిర్యాదును పంపారు.


శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పొతంగల్‌ పోలింగ్‌ బూత్‌ నుంచి ఎమ్మెల్సీ కవిత ఓటు చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించి ఆధారాలనూ సమర్పించారు. పొతంగల్‌ ఓటరు జాబితాలో తన ఓటును తొలగించుకోకుండానే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయడం ప్రజాస్వామ్యాన్ని మోసం చేయడమేనని ఇందిర విమర్శించారు.


నిబంధనల ప్రకారమే ఓటు బదలాయింపు: టీఆర్‌ఎస్‌

నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం పొతంగల్‌ గ్రామ పరిధిలో తనకు, తన భర్తకు ఉన్న ఓటు హక్కును ఖైరతాబాద్‌ నియోజకవర్గం పరిధిలోకి మార్చాలని ఎమ్మెల్సీ కవిత అక్కడి ఈఆర్‌వోకు దరఖాస్తు చేసుకున్నారని టీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. నవంబరు 28న ఓటు బదిలీ ప్రక్రియ పూర్తయిందని, దీంతో కవిత హైదరాబాద్‌లో ఓటు వేశారని పార్టీ నేతలు తెలిపారు.

కాగా, తమకు ఖైరాతాబాద్‌ ఈఆర్‌వో నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు పొతంగల్‌ ఉన్న కవిత ఓటును ఎన్నికల కమిషన్‌ జాబితా నుంచి తొలగించామని.. నేషనల్‌ సర్వీసు ఓటర్ల లిస్టులో వారం రోజుల తర్వాత తొలగిస్తారని బోధన్‌ ఆర్డీవో రాజేశ్వర్‌ వెల్లడించారు.


Updated Date - 2020-12-02T07:53:15+05:30 IST