చక్రం తిప్పుతున్న కల్వకుంట్ల కవిత?
ABN , First Publish Date - 2021-07-17T08:10:13+05:30 IST
హైదరాబాద్లోని కవిత నివాసంలో జరిగిన ఈ పంచాయితీలో....
హెచ్సీఏలో అజర్, జాన్ వర్గాల మధ్య సయోధ్య
ఏసీఏ పరిస్థితి తీసుకురావద్దని హితవు!
కొత్త జిల్లాల గుర్తింపులో జాగృతి వర్గాలకు ప్రాధాన్యం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వివాదాలకు టీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెక్ పెట్టారు. హెచ్సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ వర్గాల మధ్య కవిత సయోధ్య కుదిర్చినట్టు తెలిసింది. హైదరాబాద్లోని కవిత నివాసంలో జరిగిన ఈ పంచాయితీలో అజర్, జాన్తో పాటు హెచ్సీఏ ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వివాదాలు, కుమ్ములాటలు పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, లేదంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)లో జరిగిన పరిణామాలే ఇక్కడా చవిచూడాల్సి వస్తుందని ఒకింత గట్టిగానే ఇరు వర్గాలకు కవిత చెప్పారట. కోర్టుల్లో ఉన్న కేసులు, ఒకరికొకరు ఇచ్చుకున్న షోకాజ్ నోటీసులు అన్నీ వెనక్కి తీసుకొని క్రికెట్ కార్యకలాపాలను తక్షణమే పునరుద్ధరించాలని ఆమె సూచించారని సమాచారం. కవిత మధ్యవర్తిత్వంతో.. వివాదానికి కేంద్ర బిందువైన అంబుడ్స్మన్ దీపక్ వర్మ విషయంలోనూ అజర్ కాస్త వెనక్కి తగ్గాడట. ఇకపోతే, హెచ్సీఏలో తన పలుకుబడి పెంచుకునేందుకు చాలాకాలంగా కసరత్తు చేస్తున్న కవిత కొత్త జిల్లాల గుర్తింపు విషయాన్ని కూడా ఈ సందర్భంగా చర్చించినట్టు తెలిసింది.
ఇటీవల ఆరు కొత్త జిల్లాలకు గుర్తింపునిస్తున్నట్టు అజర్ ప్రకటించగా.. అందులో సిద్ధిపేట మినహా మిగిలిన 5 జిల్లాలు జాగృతిలో కీలకంగా వ్యవహరించే వ్యక్తులకు సంబంధించిన సంఘాలకే గుర్తింపు ఇవ్వడం కొసమెరుపు. ఈ ఐదు జిల్లాల్లో మంచిర్యాల సంఘాన్ని కవిత మాజీ పీఏ నడిపిస్తుండగా, మరో జిల్లా క్రికెట్ సంఘం బాధ్యతలను ఆమె సమీప బంధువు చూస్తున్నట్టు తెలిసింది. వీటితో పాటు త్వరలో సిరిసిల్ల సహా మరో 6 కొత్త జిల్లాలకు గుర్తింపు ఇచ్చే విషయమూ ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. మొత్తానికి అజర్, జాన్ వర్గాల మధ్య వివాదం సద్దుమణగడంతో ఈనెల 18న జరగాల్సిన ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు హెచ్సీఏ కార్యదర్శి విజయానంద్ ఒక లేఖను విడుదల చేశారు.
వినోద్ ఇంట్లో మాజీల భేటీ
ప్రస్తుత కార్యవర్గం కదలికలపై సమాచారమందుకున్న మాజీలు హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు జి.వినోద్కు చెందిన ఓ కాలేజీలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ భేటీకి శివ్లాల్ యాదవ్, శేష్నారాయణ, యాదగిరి, చిట్టి శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. అసోసియేషన్ కార్యకలాపాల్లో బయటి వ్యక్తుల ప్రమేయాన్ని ఏ విధంగా నిరోధించాలి.. మరో ఏడాదిలో జరిగే హెచ్సీఏ ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలనే విషయాలు ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది.